- నవంబర్లో అమ్ముడైన వెహికల్స్ 28.54 లక్షలు
- ప్యాసింజర్, టూవీలర్ సెగ్మెంట్లో 21 శాతం గ్రోత్
- తగ్గిన ట్రాక్టర్, కమర్షియల్ వెహికల్ సేల్స్
న్యూఢిల్లీ : వెహికల్స్ అమ్మకాలు కిందటి నెలలో రికార్డ్ లెవెల్కు చేరుకున్నాయి. ప్యాసింజర్ వెహికల్స్తో (కార్లు, బస్సులు వంటివి) పాటు టూవీలర్ల సేల్స్ కూడా భారీగా పెరిగాయని డీలర్ల అసోసియేషన్ ఫాడా బుధవారం పేర్కొంది. మొత్తంగా 28,54,242 బండ్లు ఈ ఏడాది నవంబర్లో అమ్ముడయ్యాయి. కిందటేడాది నవంబర్లో జరిగిన 24,09,535 బండ్లతో పోలిస్తే 18 శాతం పెరిగాయి. ఇందులో 3,60,431 ప్యాసింజర్ వెహికల్స్ ఉన్నాయి. కిందటేడాది నవంబర్లో అమ్ముడైన 3,07,550 బండ్లతో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. అదే విధంగా టూవీలర్ల సేల్స్ 21 శాతం వృద్ధి చెంది 18,56,108 బండ్ల నుంచి 22,47,366 బండ్లకు చేరుకున్నాయి. ‘వెహికల్ రిటైల్ సేల్స్లో కిందటి నెల రికార్డ్ క్రియేట్ చేశాం.
ఏకంగా 28.54 లక్షల బండ్లు అమ్ముడయ్యాయి. 2020 మార్చిలో నమోదైన రికార్డ్ లెవెల్ 25.69 లక్షల వెహికల్స్ను అధిగమించాం’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనిష్ రాజ్ సింగానియా ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. టూవీలర్లు, ప్యాసింజర్ వెహికల్స్ సెగ్మెంట్లు ఈ ఏడాది నవంబర్లో రికార్డ్లు క్రియేట్ చేశాయని చెప్పారు.
ఫుల్ జోష్లో టూవీలర్స్
టూవీలర్ అమ్మకాలు కిందటి నెలలో 22.47 లక్షలకు చేరుకున్నాయి. 2020 మార్చిలో నమోదైన రికార్డ్ లెవెల్ కంటే 1.77 లక్షల బండ్లు ఎక్కువ అమ్ముడయ్యాయి. అలానే ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 2020 అక్టోబర్లో నమోదైన రికార్డ్ లెవెల్ కంటే 4 వేల యూనిట్లు ఎక్కువ సేల్ అయ్యాయి. 3.6 లక్షల వెహికల్స్ అమ్ముడయ్యాయి. దీపావళి కావడంతో పాటు కంపెనీలు కొత్త మోడల్స్ను తీసుకురావడంతో కిందటి నెలలో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు భారీగా పెరిగాయని సింఘానియా వెల్లడించారు. సప్లయ్ చెయిన్ సమస్యలు తగ్గడంతో ఫెస్టివల్ డిమాండ్ను కంపెనీలు చేరుకోగలిగాయని అన్నారు. కానీ, పండుగ అయిపోయిన తర్వాత నుంచి సేల్స్ తగ్గుతుండడాన్ని చూడొచ్చని పేర్కొన్నారు. డిమాండ్ కంటే ఎక్కువ సప్లయ్ జరగడంతో కంపెనీల దగ్గర ఇన్వెంటరీ (నిల్వలు) పెరిగిందని , ఇన్వెంటరీని సరిగ్గా మేనేజ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందని సింఘానియా వెల్లడించారు.
గ్రామాల్లో డిమాండ్
గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడంతో టూవీలర్ల సేల్స్ భారీగా పెరిగాయి. వీటికి తోడు కొత్త బండ్లు లాంచ్ అవ్వడం, అప్గ్రేడెడ్ మోడల్స్ అందుబాటులో ఉండడం వంటివి కలిసొచ్చాయి. కిందటి నెల 99,890 త్రీవీలర్ బండ్లు అమ్ముడయ్యాయని, కిందటేడాది నవంబర్తో పోలిస్తే 23 శాతం పెరిగాయని ఫాడా వెల్లడించింది. కానీ, ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 21 శాతం తగ్గి 78,720 వెహికల్స్ నుంచి 61,969 యూనిట్లకు పడ్డాయి. అదే విధంగా కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా 2 శాతం తగ్గి 84,586 బండ్లుగా రికార్డయ్యాయి.
సీజన్ కాకపోవడంతో పాటు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోవడంతో ట్రాక్టర్ల సేల్స్ పడ్డాయని సింఘానియా వెల్లడించారు. సమీప భవిష్యత్లో టూవీలర్ల సేల్స్ మరింత పెరుగుతాయని ఫాడా అంచనా వేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో టూవీలర్లకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ఈసారి సుమారు 38 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నామని, వెహికల్ సేల్స్ పెరగడంలో ఇవి సాయపడతాయని అన్నారు. అలానే సమస్యలూ లేకపోలేదని సింఘానియా చెప్పారు. వాతావరణ పరిస్థితులు బాగోలేకపోవడంతో రబీ పంటలపై ప్రభావం పడుతోందని, ఫలితంగా గ్రామీణ ప్రజలు ఆదాయాలు తగ్గే ఛాన్స్ ఉందన్నారు.