
- బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్
- ఏ నిబంధనల ప్రకారం కొత్త నిర్ణయాలు తీసుకున్నరు?
- సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి
- ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నడుచుకోవాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ తప్పుడు నిర్ణయాల వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు ఎక్సైజ్ శాఖకు చెడ్డ పేరు వస్తున్నదని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. నాంపల్లిలోని ఆబ్కారీ ఆఫీస్లో ఎక్సైజ్ శాఖపై మంగళవారం జూపల్లి కృష్ణారావు రివ్యూ చేశారు.
అధికారుల సొంత నిర్ణయాల వల్ల ఎక్సైజ్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. మద్యం కంపెనీలకు అనుమతుల వ్యవహారంలో ప్రభుత్వ దృష్టికి తీసుకురాకుండా బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ఎలా విధివిధానాలు ఖరారు చేస్తారని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వాలని, విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎండీ శ్రీధర్, బ్రూవరీస్ కార్పొరేషన్ జీఎం అబ్రహంను మంత్రి ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డ్రగ్మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తాం
డ్రగ్ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి జూపల్లి తెలిపారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, కల్తీ కల్లు, గుడుంబా, గంజాయి సరఫరా, అమ్మకాలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. తయరీదారులు, సరఫరాదారులు, విక్రేతలు, సప్లయర్ నెట్ వర్క్ జాబితాతో డాటా బేస్ తయారు చేయాలని సూచించారు. తరచుగా ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
యాంటీ నార్కోటిక్ బ్యూరో, పోలీసు శాఖ సమన్వయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు పని చేయాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. సాంకేతికను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వాటివల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు మీడియా, సోషల్ మీడియా, థియేటర్లలో ఆడియో, వీడియోలో రూపంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.