బహ్రెయిన్ ప్రధాని, ఆ దేశ రాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్(84) బుధవారం మరణించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన అమెరికాలోని మయో క్లినిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఆయన మృతికి గల కారణాలను చెప్పలేదు. ఖలీఫా పార్దీవదేహం వచ్చిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ప్రభుత్వం వారంరోజుల సంతాప దినాలను ప్రకటించింది. అలాగే మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు గురువారం నుండి మూడు రోజుల పాటు మూసివేయనున్నారు.
బహ్రెయిన్ స్వాతంత్య్రం పొందడానికి ఒక ఏడాది ముందు నుండి అంటే 1970 నాటి నుండి ఖలీఫా బిన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన రికార్డును బిన్ సల్మాన్ ఖలీఫా సొంతం చేసుకున్నారు. 2011లో ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో.. ఖలీఫాను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఇటీవలి కాలంలో ఆయన అధికారాలను తగ్గిస్తూ.. రాజ్యాంగంలో సవరణలు కూడా చేశారు. ఆ తర్వాత తిరిగి ప్రధానిగా కొనసాగారు.