హైదరాబాద్, వెలుగు : వచ్చే ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్), ఛారిటబుల్ ప్రోగ్రామ్ల కోసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని బజాజ్ గ్రూప్ శుక్రవారం ప్రకటించింది. ‘బజాజ్ బియాండ్’ కింద యువత స్కిల్స్ను డెవలప్ చేయడంపై ఎక్కువ ఫోకస్ పెడతామని పేర్కొంది. 2 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని ఈ గ్రూప్ అంచనా వేస్తోంది. సీఎస్ఆర్ ప్రోగ్రామ్ల కోసం గతంలో కూడా బజాజ్ గ్రూప్ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. ‘గత పదేళ్లలో రూ. 4 వేల కోట్లు వెచ్చించాం.
ముఖ్యంగా యువత స్కిల్స్ పెంచడం, ఎడ్యుకేషన్, హెల్త్, నీటి పొదుపుపై ఖర్చు చేశాం’ అని బజాజ్ గ్రూప్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. బజాజ్ ఇంజినీరింగ్ స్కిల్స్ ట్రెయినింగ్ (బెస్ట్) ప్రోగ్రామ్ 2023 లో లాంచ్ అయ్యింది. ఇంజినీరింగ్, డిప్లామా గ్రాడ్యుయేట్ల స్కిల్స్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ను బజాజ్ గ్రూప్ తీసుకొచ్చింది. ఇందుకోసం పూణెలో అతిపెద్ద సెంటర్ను ఏర్పాటు చేసింది.
120 మంది స్టూడెంట్లు ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కింద చదువుతున్నారు. దేశం మొత్తం మీద 15 సెంటర్లను ఏర్పాటు చేయాలని ఈ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. బ్యాంకింగ్ సెక్టార్లో బజాజ్ ఫిన్సర్వ్ తెచ్చిన సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సీపీబీఎఫ్ఐ కూడా యువత స్కిల్స్ పెంచడంలో సాయపడుతోంది. సీపీబీఎఫ్ఐతో దేశం మొత్తం మీద 53 వేల మందికి లబ్ది చేకూరిందని కంపెనీ పేర్కొంది.