బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది

బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ఆదాయం గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.347కోట్ల వరకు తగ్గింది.  2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాల అనుమతుల ద్వారా బల్దియాకు రూ.1,454.76 కోట్లు రాగా, 2023‌‌‌‌‌‌‌‌–24 ఆర్థిక సంవత్సరంలో రూ.1,107.29 కోట్లు వచ్చినట్లు జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

గ్రేటర్ పరిధిలో 2023–24లో మొత్తం 2,456 బిల్డింగులకు పర్మిషన్లు ఇవ్వగా ఇందులో 130 హైరైజ్ బిల్డింగులు ఉన్నాయి. అత్యవసర అప్రూవల్స్​8,122 ఇచ్చినట్లు పేర్కొన్నారు. సింగిల్​ విండో ద్వారా 2,456 పర్మిషన్లు ఇచ్చినట్లు తెలిపారు. 

2,567 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు చెప్పారు. ఇనిస్టిట్యూషనల్​నిర్మాణాలకు 34 అప్రూవల్స్​ ఇవ్వగా ఇందులో 12 హైరైజ్ ఉన్నట్టు తెలిపారు. 2,282 రెసిడెన్షియల్ బిల్డింగులకు అప్రూవల్స్​ఇవ్వగా ఇందులో 74 హైరైజ్ భవనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. భవనాల ఎత్తు 188.6 మీటర్ల వరకు అనుమతులు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 51 ఫ్లోర్లకు పర్మిషన్​ఇచ్చినట్లు వెల్లడించారు.