- రైస్ ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ : పార్బాయిల్డ్ (పాక్షికంగా ఉడకబెట్టిన) రైస్ ఎగుమతులపై 20 శాతం ట్యాక్స్ వేసిన మరుసటి రోజే బాస్మతీ రైస్ ఎగుమతులనూ ప్రభుత్వం బ్యాన్ చేసింది. టన్ను 1,200 డాలర్ల (రూ.98 వేల) కంటే తక్కువ విలువున్న బాస్మతీ రైస్ ఎగుమతులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికే నాన్ బాస్మతీ రైస్ ఎగుమతులను నిషేధించింది. బాస్మతీ రైస్ ముసుగులో ఇవి ఎగుమతవ్వకుండా ఆపేందుకు ఈ చర్య తీసుకున్నామని కామర్స్ మినిస్ట్రీ ఓ నోటిఫికేషన్లో పేర్కొంది.
‘టన్నుకు 1 ,200 డాలర్ల కంటే తక్కువ విలువున్న బాస్మతీ రైస్ కాంట్రాక్ట్లు తాత్కాలికంగా ఆగుతాయి. ఏపీఈడీఏ చైర్మన్ ఏర్పాటు చేసే కమిటీ వీటిని విశ్లేషిస్తుంది’ అని వివరించింది. కాగా, బాస్మతీ రైస్ ఎగుమతులను అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చూసుకుంటోంది. ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ కానుండడంతో దేశంలో రైస్ ధరలు పెరగకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఎల్నినో ఎఫెక్ట్ వలన థాయ్లాండ్లో రైస్ ప్రొడక్షన్ తగ్గింది. ఫలితంగా సప్లయ్ కొరత నెలకొనడంతో రైస్ ధరలు 15 ఏళ్ల గరిష్టాలకు చేరుకున్నాయి. మిగిలిన దేశాల రైస్తో పోలిస్తే ఇండియాలో రైస్ ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో 2022–23, 2021–22 లో రికార్డ్ స్థాయిలో రైస్ ఎగుమతులు జరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే గ్లోబల్గా జరిగిన బాస్మతీ రైస్ ట్రేడ్లో 80 శాతం ఇండియా నుంచే జరిగింది. సుమారు 75 దేశాలకు ఈ రైస్ ఎగుమతి చేశాం.