
- కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సీపీఎం పిలుపు
ఆసిఫాబాద్, వెలుగు: టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతో గ్రామాలను, సాగు భూములను ఖాళీ చేయించే కుట్రలను జిల్లా ప్రజలు తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రెవెన్యూ గ్రామాలు, భూములను ఫారెస్ట్ భూములుగా మార్చాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను జిల్లా ప్రజలు, రైతాంగం ఐక్యంగా తిప్పి కొట్టాలన్నారు. కాగజ్ నగర్ ప్రాంతాన్ని టైగర్ జోన్గా ప్రకటించడం అన్యాయమన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకాలను, రోడ్లు, మంచినీటి బోర్లు, త్రీఫేజ్ కరెంట్ తోపాటు, అంగన్వాడీ, స్కూల్ బిల్డింగ్స్ నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టులైన కుమ్రం భీం, జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ నిధుల కేటాయింపు నిలిపివేశారని ఆరోపించారు.
పట్టాలున్న భూముల్లో కూడా వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.1950కి ముందు మ్యాప్ ప్రకారం అటవీ ప్రాంతం ఉందని, శాటిలైట్ మ్యాప్ లు ఉన్నాయని భూములు ఖాళీ చేయించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న అటవీ భూములను, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రల పట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మెతక వైఖరి అవలంభించకుండా పోరాటానికి ముందుకు రావాలని సూచించారు.
పాత టైగర్ జోన్ని కొత్త ప్రాంతాలకు విస్తరింపజేస్తూ కాగజ్ నగర్ టైగర్ జోన్ని ప్రకటించడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, నాయకులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్, గొడిసెల కార్తీక్, మాలశ్రీ తదితరులుపాల్గొన్నారు.