ట్రాక్టర్తో పొలం దున్నిన బండి సంజయ్

ట్రాక్టర్తో పొలం దున్నిన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ఓ రైతు కోరికను నెరవేర్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఐలాపుర్ లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐలాపూర్ గ్రామ సమీపంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తుండగా.. ఆయనను చూసి రైతు తన పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నాల్సిందిగా కోరాడు. రైతు కోరిక మేరకు బండి సంజయ్ ట్రాక్టర్ ఎక్కి దుక్కిదున్నారు. అనంతరం ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రలో జనం భారీగా పాల్గొన్నారు.

అనంతరం ఐలాపూర్ లో నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు కేసీఆర్ నయాపైసా ఇవ్వలేదంటూ ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లోని సర్పంచులు తమ ఆస్తులను అమ్ముకుని అడుక్కునే దుస్థితి ఏర్పడిందన్నారు. నిధులు మంజూరు చేయకుండా గ్రామాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. కోరుట్ల మండలం యూసఫ్ నగర్ నుంచి ప్రారంభమైన బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇవాళ్టికి 13వ రోజుకు చేరింది.