బీఆర్ఎస్ నేత పాడె మోసిన బండి సంజయ్, కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ నేత పాడె మోసిన బండి సంజయ్, కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ లో బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి (39) అంత్యక్రియల్లో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.  మహేందర్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం బండి సంజయ్ తో పాటు కౌశిక్ రెడ్డి కూడా పాడె మోశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బీఆర్ఎస్ సీనియర్ నేత మహేందర్ రెడ్డి గురువారం (జులై 6న) గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహం వద్ద "డాడీ.. లే .. డాడీ" అంటూ తన కొడుకు రోదనలు మిన్నంటాయి. "డాడీని లేమ్మని చెప్పు" అని పక్క వాళ్లను అడుగుతూ ఏడుస్తున్న బాలుడిని చూసి అక్కడున్న వారందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. నందగిరి మహేందర్ రెడ్డి కుటుంబం సైదాపూర్ మండలం రాయికల్ నుంచి వచ్చి చాలా కాలంగా హుజురాబాద్ లో నివాసం ఉంటోంది. గతంలో హుజురాబాద్ పట్టణం బీజేపీ అధ్యక్షుడుగానూ మహేందర్ రెడ్డి పని చేశారు. చనిపోయే ముందు వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.