కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదు : బండి సంజయ్

కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదు :  బండి సంజయ్

మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులను లీగల్ గానే ఎదురుకుంటామని చెప్పారు.  కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పరువుకే 100 కోట్లు అయితే 30లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. మరి వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తావో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు.  అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుంచి కేటీఆర్ కు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. 

TSPSC  పేపర్ లీకేజీపై  కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు మార్చి 28న  మంత్రి కేటీఆర్  లీగల్  నోటీసులు పంపించారు.  తనపై  నిరాధారమైన , ఆసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ  నోటీసుల్లో  పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలను మాట్లాడుతున్నారన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో తెలిపారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే  ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల పరువు నష్టం దావాను ఎదురుకోవాల్సి వస్తుందని కేటీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.