రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ఎంపిక చేస్తున్నారని, వారికి ఆర్థిక సాయం కూడా చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.
భవిష్యత్తులో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డే చెప్పారని తెలిపారు. రాష్ర్టపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రతిపాదించినప్పుడు ఆమెను ఓడించాలని రెండు పార్టీలు చూశాయని, కర్ణాటక ఎన్నికల్లోసైతం కాంగ్రెస్కు కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి..
తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ఏం చేసిందో చెప్పడానికి తమతో బహిరంగ చర్చకు రావాలని , కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదని నిరూపించాలని బండి సంజయ్ డిమాండ్చేశారు. బీఆర్ఎస్ సర్కార్ కేంద్ర నిధుల్ని దారి మళ్లిస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు బండి తెలిపారు.
రుణ మాఫీ చేయాలి...
సీఎం కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని 2018 లో హామీ ఇచ్చి.. ఇప్పటికీ అమలు చేయకపోవడం బాధాకరం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో లోపాలు ఉన్నాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే ధరణిలో లోపాలు సరిచేసి పబ్లిక్ ఇబ్బందులు తీరుస్తామన్నారు.
అసలు హోం మంత్రి ఉన్నారా?
మహిళల దుస్తులపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై బండి స్పందిస్తూ.. అసలు రాష్ర్టంలో హోం మంత్రి ఉన్నాడా, హత్యలు, హత్యాచారాలు జరుగుతుంటే ఆయన ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. హిందూ ప్రజలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. 18 రాష్ర్టాల్లో బీజేపీ గెలిచినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నేతలు, కర్ణాటకలో గెలవగానే ఎగిరెగిరిపడుతున్నారన్నాki. కన్నడ నాట కాంగ్రెస్ గెలవగానే మత మార్పిడి బిల్లు తెచ్చారని, దీంతో మళ్లీ హిందూ సమాజం ఏకమవుతోందని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 45 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
రాష్ర్టంలో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వస్తుందని తెలిసే సీఎం కేసీఆర్ మళ్లీ కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ని ఎంత లేపిన లేచే స్థితిలో లేదని విమర్శించారు. కేసీఆర్ ఇప్పుడు ప్రధాని మోడీని తన మిత్రుడిగా చెప్పుకుంటున్నారని అది ఎలాగో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ సిద్దాంతాలను, మోడీ నాయకత్వాన్ని నమ్మి పార్టీలోకి వచ్చే వారినే స్వాగతిస్తామని, ఎవరో రావాలని తాము చూడట్లేదని పేర్కొన్నారు. బీజేపీలోంచి పలువురు వెళ్లిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. తమ పార్టీలోంచి ఎవరూ వెళ్లబోరని తెలిపారు.