రాజన్నసిరిసిల్ల, వెలుగు: జిల్లాలో బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మెంబర్(ఎస్సీపీసీఆర్) మర్రిపెల్లి చందన అన్నారు. మంగళవారం ఎస్పీ మహేశ్ కుమార్ బి.గీతేతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో జనవరి 1 నుంచి 31వరకు ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తామన్నారు.
చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోవడం నేరమని, అలా చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులను గుర్తిస్తే హెల్ప్ లైన్ 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
