మోడీ పర్యటన నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో బండి సంజయ్ భేటీ

మోడీ పర్యటన నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలతో  బండి సంజయ్ భేటీ

హైదరాబాద్ : ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్టేట్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు మోడీ రామగుండానిక రానున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్ ను నవంబర్ 12వ తేదీన ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. గతంలో మూతబడిన రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. మొత్తం రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది.మోడీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్ సిఎల్ ను కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఇటీవలే సందర్శించారు.