- కేసీఆర్పై సంజయ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సద్దుల బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగకు సెలవు ఇవ్వకుండా కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అని, అంతటి విశిష్టమైన పండుగకు సెలవు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మన రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా, వేరే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా అని నిలదీశారు.
బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వని కేసీఆర్ ఓ మూర్ఖుడని విమర్శించారు. అవసరం అయితే తెలంగాణ ఉద్యోగులంతా విధులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.