తెలంగాణకు డబుల్​ ఇంజన్ ​సర్కార్​ అవసరం

తెలంగాణకు డబుల్​ ఇంజన్ ​సర్కార్​ అవసరం
  • టీఆర్​ఎస్​ బెదిరింపులకు భయపడం: బండి సంజయ్​

నల్గొండ, వెలుగు: టీఆర్​ఎస్​ బెదిరింపులకు తాము భయపడేది లేదని, తెగించి కొట్లాడుతామని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ స్పష్టం చేశారు. పోలీస్​స్టేషన్లలోనూ బీజేపీ కార్యకర్తలపై టీఆర్​ఎస్​ గూండాలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శనివారం నల్గొండలోని జిల్లా బీజేపీ ఆఫీసులో నల్గొండ, వరంగల్​, ఖమ్మం జిల్లాల జోనల్​ మీటింగ్​కు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూర్ఖపు పార్టీని ప్రజలు, బీజేపీ నాయకులు ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని, ఇక్కడ బెంగాల్​ తరహా పాలన సాగదని హెచ్చరించారు. పోలీస్​స్టేషన్లను టీఆర్​ఎస్​ నాయకులు పంచాయితీ, సెటిల్మెంట్లకు అడ్డాలుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులకు డీజీపీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్​ చేశారు.

డబుల్​ ఇంజన్ ​సర్కార్​ అవసరం
కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో బీజేపీని నిందించి తెలంగాణ సెంటిమెంట్​ రగిల్చి రాజకీయ లబ్ధిపొందేందుకు టీఆర్​ఎస్​ ప్రయత్నిస్తున్నదని సంజయ్​ అన్నారు. కేంద్ర పథకాలు అమలు చేయకుండా ఇక్కడి ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రంలో కూడా డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. టీఆర్​ఎస్​ పతనం ప్రారంభమైందని,  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అంటే కేసీఆర్​ ప్రభుత్వం భయపడుతున్నదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ టీఆర్​ఎస్​ పెద్దలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో రోడ్లు, బియ్యం, రైల్వే ప్రాజెక్టులు, స్వచ్ఛ భారత్​, మరుగుదొడ్లు తదితర వాటిన్నింటినీ మోడీ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు.  కాగా.. వరంగల్​, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పరిధిలో బీజేపీ బలం, బలహీనతలు, సంస్థాగత నిర్మాణంపై బీజేపీ జాతీయ సంస్థాగత జాయింట్​ ఆర్గనైజింగ్​ సెక్రటరీ శివప్రకాశ్​ దిశానిర్దేశం చేశారు.