ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

ఐదో విడత పాదయాత్రకు సిద్ధమైన బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర మొదలుపెట్టనున్నారు. అదే రోజున భైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభ నిర్వహించనున్నారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు బండి సంజయ్ యాత్ర కొనసాగే అవకాశముంది. ఐదో విడతలో కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహించనున్నారు. 

కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్  ఇప్పటి వరకు 4 విడతలుగా పాదయాత్ర చేశారు. మొత్తం 21 జిల్లాల్లోని 13 లోక్ సభ, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,178 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. 

బండి సంజయ్ నాల్గో విడత పాదయాత్రను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని 9 నియోజకవర్గాలను కవర్ చేస్తూ 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగింది. ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ఆలస్యమైంది.