బండి సంజయ్ అత్తగారింట్లో 'బలగం' సీన్ రిపీట్

బండి సంజయ్ అత్తగారింట్లో 'బలగం' సీన్ రిపీట్

పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్టయి, విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇంట్లో ఇటీవల వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన 'బలగం' సినిమాలోని ఓ సీన్ రిపీట్ అయింది. ఈ మూవీలో హీరో తాతకు పిండం పెడితే పిట్ట ముట్టనట్టే.. బండి సంజయ్ అత్త గారు చనిపోవడంతో పిండం పెడితే పిట్ట ముట్టలేదు. ఈ విషయాన్ని స్వయానా ఆయనే తెలియజేశారు. తన అమ్మ తర్వాత ఆమే తనను కన్నకొడుకులా చూసుకున్నారని, తాను లేకపోవడంతో పక్షి ముట్టలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇటీవలే బండి సంజయ్ అత్తగారు చనిపోగా.. ఐదో రోజు పిట్టకు పెట్టారు. కానీ ఎంత సేపటికీ పిట్ట ముట్టలేదు. ఆ సమయంలో తనను అరెస్టు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు కేవలం పోస్టుల కోసం, పైసల కోసం పని చేస్తారన్నారు. ఓ పార్లమెంటరీ సభ్యుడితో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఆలోచన ప్రకారం పార్టీ ఫస్ట్, ఫ్యామిలీనే నెక్ట్స్ అంటూ కామెంట్ చేశారు.

ఇటీవల టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయి, కరీంనగర్ జైళ్లో ఉన్న బండి సంజయ్ ను అతని భార్య అపర్ణ, సోదరులు కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తనతో కొన్ని మాటలు మాట్లాడినట్టు ఆమె చెప్పారు. అత్త గారి కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన తనను అక్రమంగా అరెస్టు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు. పోలీసులకు 'బలగం' సినిమా చూపిస్తే బాగుండేదని బండి సంజయ్ అన్నట్టు చెప్పారు. అప్పుడైనా వారికి ఫ్యామిలీ ఎమోషన్స్ అర్థమయ్యేవని ఆయన తనతో చెప్పినట్టు అపర్ణ వివరించారు.