- ఓ ఇంట్లో అజీమ్ అన్వర్ డెడ్బాడీని గుర్తించిన పోలీసులు
- ఢాకాలో ముగ్గురిని అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ అధికారులు
కోల్కతా: వైద్య చికిత్స కోసం ఇటీవల భారత్కు వచ్చి, కనిపించకుండా పోయిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ పశ్చిమబెంగాల్లో హత్యకు గురయ్యారు. కోల్కతాలో న్యూటౌన్ లోని ఓ ఖాళీ ఇంట్లో ఆయన డెడ్బాడీని పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసుపై రాష్ట్ర సీఐడీ దర్యాప్తు చేపట్టింది. హత్యకు సంబంధించిన వివరాలను సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది బుధవారం వెల్లడించారు.
బంగ్లాదేశ్ ఎంపీ కోల్కతాకు వస్తున్నట్లు మాకు సమాచారం లేదు. అజీమ్ అన్వర్ కనిపించట్లేదని కోల్కతాలోని ఆయన ఫ్రెండ్ ఈ నెల 18న కంప్లైంట్ చేశారు. ఆయన ఆచూకీ కోసం బరాక్పూర్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 20న విదేశాంగ శాఖ నుంచి కూడా మాకు సమాచారం అందింది. దర్యాప్తులో అజీమ్ హత్యకు గురైనట్లు తేలింది. న్యూ టౌన్లోని లగ్జరీ కండోమినియం అపార్ట్మెంట్లో ఆయన డెడ్ బాడీని ముక్కలు చేశారు’’ అని సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది పేర్కొన్నారు.
ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారు..
ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ హత్యపై బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ స్పందిస్తూ..‘‘కోల్కతాలోని ఓ ఇంట్లో అన్వర్ను పథకం ప్రకారం హత్య చేశారు. ఈ హత్య వెనుక ఉద్దేశం ఏంటి.. దోషులు ఎవరో తెలుసుకోవడానికి భారత్, బంగ్లాదేశ్కు చెందిన రెండు పోలీసు బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. అందుకోసం మేం అంతర్జాతీయ ప్రోటోకాల్ను అనుసరిస్తున్నాం”అని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఢాకాలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..!
బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ చికిత్స నిమిత్తం మే 12న బెంగాల్కు వచ్చారు. బారానగర్లోని తన ఫ్రెండ్ గోపాల్ బిశ్వాస్ ఇంట్లో బసచేశారు. 13న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో స్నేహితుడితో పాటు బంగ్లాదేశ్లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఫోన్లు చేశారు. ఎవరి కాల్స్ ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో వెంటనే బిశ్వాస్ కోల్ కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజీమ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు. 8 రోజులుగా బెంగాల్ పోలీసులు, బంగ్లాదేశ్ అధికారులు అన్వరుల్ కోసం గాలించగా, బుధవారం ఆయన మృతదేహం లభ్యమైంది.