ఇండియాలో బంగ్లా ప్రధాని నాలుగు రోజుల పర్యటన

ఇండియాలో బంగ్లా ప్రధాని నాలుగు రోజుల పర్యటన
  • ఇండియాలో బంగ్లా ప్రధాని నాలుగు రోజుల పర్యటన
  • డిఫెన్స్, ట్రేడ్, నదీ జలాల పంపకాలపై చర్చలు

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా మన దేశంలో 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెకు ఢిల్లీ ఎయిర్​పోర్టులో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి దర్మనా జర్దోశ్​ స్వాగతం పలికారు.షేక్​ హసీనా పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చీ చెప్పారు. షేక్ హసీనా ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. డిఫెన్స్, ఇన్వెస్ట్​మెంట్స్, ట్రేడ్, ఎనర్జీ సెక్టార్​లో పరస్పర సహకారం, ఉమ్మడి నదీ జలాల పంపకాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రత నిర్వహణ, డ్రగ్స్​ అక్రమ రవాణ నియంత్రణ మొదలైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.  రివర్​ వాటర్​ షేరింగ్​ విషయంలో పోయిన నెలలో చేసుకున్న అగ్రిమెంట్​ను మంగళవారం ఫైనల్​ చేయనున్నారు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) నిర్వహించే ఓ బిజినెస్ సమ్మిట్ కు ఆమె హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్దీప్​ ధన్​కర్​తో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. చివరి రోజైన గురువారం రాజస్థాన్​లోని అజ్మీర్‌‌కు వెళ్తారు. అక్కడ సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిస్తీ దర్గాను సందర్శిస్తారు. షేక్ హసీనా బృందంలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, వాణిజ్య,  రైల్వే మంత్రి, ఆర్థిక వ్యవహారాల సలహాదారు ఉన్నారు. హసీనా చివరి సారిగా 2019 అక్టోబర్​లో ఇండియాలో పర్యటించారు. నిరుడు మార్చిలో నిర్వహించిన 50 ఏండ్ల స్వాతంత్ర్య వేడుకలకు నరేంద్ర మోడీ బంగ్లాదేశ్​ వెళ్లొచ్చారు.