మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్​ గ్యారంటీలు వెనక్కి

మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్​ గ్యారంటీలు వెనక్కి
  • కరోనాను సాకుగా చూపి గత ప్రభుత్వ నిర్ణయం
  • పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్​ ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసినం 
  • కాళేశ్వరం కమిషన్​ ముందు సీఈ వెంకటరమణారెడ్డి వెల్లడి
  • బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్​ చేసే నిర్మాణాలే.. 
  • కానీ, నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన
  • అన్నారం బ్యారేజీ అలైన్​మెంట్​లో తేడాలున్నయ్​: ఈఈ యాదగిరి
  • 11 మీటర్ల మేర నీటిని స్టోర్​ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి తెచ్చారని వెల్లడి
  • రెండు మూడు నెలలకోసారి బ్యారేజీ పరిశీలించినం: క్యూసీ రిటైర్డ్​ సీఈ వెంకటేశ్వర్లు

హైదరాబాద్, వెలుగు: కరోనాను సాకుగా చూపి మేడిగడ్డ ప్రారంభానికి ముందే కాంట్రాక్ట్​ ఏజెన్సీకి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చిందని కాళేశ్వరం జ్యుడీషియల్​కమిషన్​కు సీఈ వెంకటరమణా రెడ్డి తెలిపారు.  ‘‘బ్యాంకు గ్యారంటీలను రిలీజ్​ చేయాలని గత సర్కారు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఆ ఉత్తర్వులతోనే నాడు ఏజెన్సీలకు బ్యాంకు గ్యారంటీలను తిరిగి ఇచ్చాం’’ అని వెల్లడించారు. శనివారం క్రాస్​ ఎగ్జామినేషన్​లో భాగంగా కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్ర ఘోష్​.. క్వాలిటీ కంట్రోల్​ ఇంజినీర్లు, మేడిగడ్డ బ్యారేజీకి పనిచేసిన రిటైర్డ్​ ఇంజినీర్లతోపాటు మేడిగడ్డ ఈఈ, మహబూబ్​నగర్​ సీఈలను విచారించారు.

  ‘‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి శాంక్షన్​ ఇచ్చింది ‘హెడ్​ ఆఫ్​ ది స్టేట్​’.. బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని నాటి సీఈకి ఆయన ఆదేశాలిచ్చారు. ఆ ఆదేశాల మేరకే నాటి రామగుండం సీఈ బి. వెంకటేశ్వర్లు బ్యారేజీకి టెక్నికల్​అనుమతులు మంజూరు చేశారు.. పై నుంచి ఆదేశాల్లేకుండా బ్యారేజీని మేమెలా నిర్మిస్తాం?’’ అని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్​ చేసే నిర్మాణాలేనని, కానీ, నీటిని స్టోర్​ చేయాలంటూ పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. ఫుల్​రిజర్వాయర్​ లెవెల్​వరకు నీటిని నిల్వ చేయాలని చెప్పారన్నారు. అందులో తమ తప్పేం లేదని స్పష్టం చేశారు. బ్యారేజీ నిర్మాణాన్ని నాడు రూ.1,849.30 కోట్లు, దాని మీద 2.7% అదనంగా అగ్రిమెంట్​అమౌంట్​తో ప్రారంభించారని తెలిపారు. 

కాంట్రాక్ట్​ సంస్థ విజ్ఞప్తితోనే ఫీల్డ్​ ఎగ్జిక్యూటివ్​ఇంజినీర్​ బ్యారేజీ నిర్మాణం పూర్తయినట్టు కంప్లీషన్​ సర్టిఫికెట్​ ఇచ్చారని, దానిపై తాను కేవలం సంతకం మాత్రమే చేశానని వివరించారు. 2019 నుంచే మూడు బ్యారేజీల్లోనూ సీపేజీ ఏర్పడిందని పేర్కొన్నారు. 2019లోనే మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు బయటపడ్డాయని తెలిపారు. నిర్మాణం కోసం పునాదులను తవ్వాక ఐఐటీ హైదరాబాద్​కు చెందిన ఉమాశంకర్​అనే ప్రొఫెసర్​తో లోపాలపై విశ్లేషించే వాళ్లమని పేర్కొన్నారు. 

పలుసార్లు ఉమాశంకర్​ బ్యారేజీని పరిశీలించి, 3, 4, 5 బ్లాకుల్లో లోపాలున్నట్టు చెప్పారని తెలిపారు. మూడో బ్లాక్​లో ఇసుకకు బదులు ఇసుక, సిమెంట్​ను 1:3 పాళ్లలో మిక్స్​ చేసి వేయాల్సిందిగా చెప్పారని గుర్తుచేశారు.  నాలుగు, ఐదో బ్లాకుల్లో ఎం15 సిమెంట్​కాంక్రీట్​తో పటిష్టం చేయాలని చెప్పారన్నారు. ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​(ఓఅండ్​ఎం) విఫలమవడం వల్లే బ్యారేజీ కుంగిందని తేల్చి చెప్పారు. 

అలైన్​మెంట్​లో తేడాలు: ఈఈ యాదగిరి

అన్నారం బ్యారేజీ డిజైన్​ అలైన్​మెంట్​లో తేడాలున్నాయని, దాని వల్ల బ్యారేజీకి సమస్యలు వస్తున్నాయని అన్నారం బ్యారేజీ ఈఈ యాదగిరి తేల్చి చెప్పారు. బ్యారేజీ క్రాస్​సెక్షన్​112 మీటర్ల నుంచి 103 మీటర్ల తేడాతో ఉన్నదని వివరించారు. నాలుగేండ్లూ బ్యారేజీని మూసేసి సుందిళ్లకు లిఫ్ట్​ చేశామని, మళ్లీ సుందిళ్ల నుంచి ఇక్కడికే తిప్పిపోతల్లాగా వదిలారని పేర్కొన్నారు. 11 మీటర్ల మేర నీటిని స్టోర్​ చేసి, నీటిని ఎత్తిపోసేలా తనపై ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజ్​ నేపథ్యంలో నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) నిపుణుల సూచన మేరకు బ్యారేజీ గేట్లన్నింటినీ ఎత్తామని, ఇటీవల వచ్చిన వరదతో అన్నారం బ్యారేజీకి ఎగువన, దిగువన 7 మీటర్ల మందంతో ఇసుక కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని చెప్పారు. దానిని తొలగించడం సవాల్​గా మారిందని తెలిపారు.  ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీ గేట్లను మూయడం కూడా కష్టమేనని తేల్చి చెప్పారు. 

బ్యారేజీని డిజైన్ల ప్రకారమే నిర్మించామని స్పష్టం చేశారు. అయితే, అందులో లోపాలున్నాయని చెప్పారు. వరద ప్రవాహవేగాన్ని 5 మీటర్లు​/సెకన్​గా ఉంచి పరీక్షలు చేశారని, కానీ, ఇప్పుడు బ్యారేజీ వద్ద 18 మీటర్లు​/సెకన్​గా వరద ప్రవాహ వేగం ఉంటున్నదని, ఫలితంగా డౌన్​ స్ట్రీమ్​లో నీటిని నిల్వ చేసే స్టిల్లింగ్​ బేసిన్​లో వరద పడకుండా బయటకు నెట్టుకొస్తున్నదని పేర్కొన్నారు. స్టిల్లింగ్​బేసిన్​ను రీడిజైన్​ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మేడిగడ్డ ఎఫ్ఆర్ఎల్​కు అన్నారం బ్యారేజీ 8 కిలోమీటర్ల దూరమే ఉండడంతో.. బ్యారేజీకి దిగువన ఉండే టెయిల్​ వాటర్​ లెవెల్స్​ తక్కువగా ఉంటున్నాయన్నారు. 

సమస్యలు గుర్తించినం: రిటైర్డ్​ సీఈ వెంకటేశ్వర్లు

బ్యారేజీ క్వాలిటీ కంట్రోల్​లో పెద్దగా డిఫెక్ట్స్​ ఏమీ లేవని క్వాలిటీ కంట్రోల్​ విభాగం రిటైర్డ్​ సీఈ బేతు వెంకటేశ్వర్లు చెప్పారు. చిన్న చిన్న లోపాలను గుర్తించినా.. వాటిని వెంటనే సరి చేశామని కమిషన్​ ముందు వెల్లడించారు. అయితే, ప్రాజెక్ట్​ సైట్​ను రెండు మూడునెలలకోసారి మాత్రమే పరిశీలించేందుకు వెళ్లేవాడినని ఆయన చెప్పడంతో.. కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ ఫైర్​ అయ్యారు. ‘‘అంత పెద్ద బ్యారేజీని నిర్మిస్తున్నప్పుడు ఒక సీఈగా క్వాలిటీ కంట్రోల్​ కోసం సైట్​ వద్దకు వెళ్లాల్సిన బాధ్యత మీది కాదా?” అని మండిపడ్డారు. 

ఒక సీఈగా మీ డ్యూటీని మీరు నిర్వహించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలో కనీసం రెండుసార్లైనా బ్యారేజీ సైట్​కు వెళ్లాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. మీ పనిని వేరే వారి భుజంపైకి నెట్టేందుకు ఉబలాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈగా ప్రాజెక్ట్​ సైట్​ను విజిట్​ చేయకపోవడం చాలా పెద్ద తప్పు అని అన్నారు. బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యాక ఐదేండ్లపాటు ఏజెన్సీనే ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ (ఓఅండ్​ఎం) బాధ్యతలు చూడాల్సి ఉంటుందని మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు తెలిపారు. కరోనా నేపథ్యంలో బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేశారని చెప్పారు. బ్యారేజీలకు కంప్లీషన్​ సర్టిఫికెట్​తానే ఇచ్చానని చెప్పారు. 

ఆఫీసర్లపై జస్టిస్​ఘోష్​ గరంగరం

ఎంక్వైరీ సందర్భంగా ఇంజినీర్లపై కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పగా.. అన్ని వివరాలూ తన దగ్గర ఉన్నాయని, అందరి విషయాలూ తెలుసని ​మండిపడ్డారు. తాను ఇచ్చిన వివరాలతోనే కదా తనను ప్రశ్నిస్తున్నారని క్వాలిటీ కంట్రోల్​ ఎస్ఈ దేవేందర్​ రెడ్డి అనడంతో.. కమిషన్​ చైర్మన్​ మండిపడ్డారు. 

తనకు అన్నీ తెలుసన్నారు. ఇంటరాక్షన్​లాగా పెడితే అన్ని వివరాలు చెబుతామని క్వాలిటీ కంట్రోల్​ సీఈ వెంకట కృష్ణ అనడంతో ఘోష్​సీరియస్​ అయ్యారు. “ఇంటరాక్షన్​ ఏంటి? ఇది ఎంక్వైరీ.. విచారణ జరుగుతున్నప్పుడు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పండి. నాతో మీ ఇంటరాక్షన్​ ఎందుకు?” అని ప్రశ్నించారు. కాగా, మహబూబ్​నగర్​ సీఈ వెంకటరమణా రెడ్డి.. తన హోదాను అఫిడవిట్​లో ఒకలాగా.. విచారణలో మరోలా చెప్పడంపైనా ఘోష్​మండిపడ్డారు. అఫిడవిట్​లో ఇంకా ఎన్ని తప్పులు రాశారని ప్రశ్నించారు.