పర్సనల్ లోన్లకే బ్యాంకుల మొగ్గు
కార్పొరేట్ లోన్లతో పోలిస్తే సుమారు రెండింతలు పెరిగిన అన్సెక్యూర్డ్ లోన్లు
ఏడాది ప్రాతిపదికన 26 శాతం గ్రోత్ నమోదు
ప్రభుత్వ ఉద్యోగులు, క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నవారే టార్గెట్
న్యూఢిల్లీ : బ్యాంకులు అన్సెక్యూర్డ్ లోన్ల (పర్సనల్ లోన్లు వంటివి) ను ఇవ్వడం పెంచాయి. కార్పొరేట్ లోన్ల (బిజినెస్ లోన్లు) కంటే ఈ సెగ్మెంట్ లోన్లు సుమారు రెండింతలయ్యాయి. వాల్యూ పరంగా చూస్తే, ఫిబ్రవరి 2022 – ఫిబ్రవరి 2023 మధ్య బ్యాంకులిచ్చిన అన్సెక్యూర్డ్ లోన్లు రూ. 2.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే టైమ్లో కార్పొరేట్లకు ఇచ్చిన లోన్లు రూ.1.18 లక్షల కోట్లుగా, హోమ్ లోన్లు రూ.2.49 లక్షల కోట్లుగా ఉన్నాయి. అన్సెక్యూర్డ్ లోన్లు ఫిబ్రవరి, 2022 – ఫిబ్రవరి, 2023 మధ్య ఏడాది ప్రాతిపదికన 26 శాతం పెరిగాయని ఆర్బీఐ డేటా వెల్లడించింది. కస్టమర్లు మార్ట్గేజ్ లోన్లు తీసుకోవడం తగ్గించేశారని, అంతేకాకుండా ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా పెంచడంతో బ్యాంకులు అన్సెక్యూర్డ్ లోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించింది. ‘రిస్క్ తీసుకోవడానికి బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. కార్డులు, పర్సనల్ లోన్ బిజినెస్ల వైపు దృష్టి పెడుతున్నాయి’ అని ఎమ్కే గ్లోబల్ ఎనలిస్ట్ ఆనంద్ దామ అన్నారు. కార్డ్ సెగ్మెంట్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని, ఈ సెగ్మెంట్ పుంజుకోవడానికి టైమ్ పడుతుందని చెప్పారు. ‘మిగిలిన టైప్ లోన్లతో పోలిస్తే బ్యాంకులు పర్సనల్ లోన్లకు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ లెండర్లు ఇటువంటి లోన్లు ఇవ్వడంలో ముందున్నాయి. మేము సంప్రదించిన కొన్ని బ్యాంకులు ఎస్బీఐ తీసుకొచ్చిన ఎక్స్ప్రెస్ క్రెడిట్ లాంటి సర్వీస్లను తేవాలని చూస్తున్నాయి’ అని ఆనంద్ దామ వెల్లడించారు.
కొత్త బారోవర్ల అప్లికేషన్ లేటుగా..
కొత్తగా అప్పు తీసుకోవాలనుకునేవారు అన్సెక్యూర్డ్ లోన్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని ట్రాన్స్యూనియన్ సిబిల్ పేర్కొంది. ఇప్పటికే అప్పులు తీసుకున్నవారి కంటే కొత్త వారి క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్ మెరుగ్గా ఉంటుందని బ్యాంకులు భావిస్తున్నాయంది. మరోవైపు కొత్త బారోవర్లకు లోన్లు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉంటున్నాయని వెల్లడించింది. కొత్తగా అప్పు తీసుకునేవారి క్రెడిట్ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వడానికి టైమ్ పడుతోందని, వీరిలో 79 శాతం మంది లోన్ల కోసం చాలా సార్లు అప్లయ్ చేసుకోవాల్సి వస్తోందని వివరించింది. ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెరగడంతో గవర్నమెంట్ బ్యాంకులు పర్సనల్ లోన్లు ఇవ్వడానికి వీరి వెంటపడుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులయితే క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్న కస్టమర్లను టార్గెట్ చేస్తున్నాయి. పర్సనల్ లోన్లలో 40–45 శాతం టాప్ అప్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్లని మాకరీ పేర్కొంది. కస్టమర్లలో 70 % మంది పాత వారే ఉన్నారని వివరించింది. కాగా, పెళ్లి, చదువు, ఇంటి రెనోవేషన్ వంటి వాటి కోసం పర్సనల్ లోన్లు తీసుకోవడం పెరిగింది. టైర్ 2, 3 సిటీలలో వీటికి డిమాండ్ ఊపందుకుంది.
క్యూ4 లో బ్యాంకులకు భారీ లాభాలు..
మార్చి క్వార్టర్కు సంబంధించి బ్యాంకులు తమ రిజల్ట్స్ను ప్రకటిస్తున్నాయి. క్రెడిట్ గ్రోత్ బాగుండడంతో బ్యాంకుల లాభాలు భారీగా పెరుగుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లలో అప్పులివ్వడం పెరిగిందని గుర్తు చేస్తున్నారు. హోమ్, వెహికల్, అన్సెక్యూర్డ్, స్మాల్ బిజినెస్ సెగ్మెంట్లలో లోన్లు ఇవ్వడం పెరిగిందని, ఫలితంగా బ్యాంకుల లాభాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ గ్రోత్ 13.3 శాతం పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. బ్యాంకింగ్ ఇండస్ట్రీ లాభాలు ఏడాది ప్రాతిపదికన 2022–23 లో 46 శాతం, 2023–24 లో 24 శాతం, 2024–25 లో 19 శాతం పెరుగుతాయని అంచనావేసింది. ఐసీఐసీఐ బ్యాంక్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్కు ‘బయ్’ రేటింగ్ ఇచ్చింది.