
- మాస్టర్ప్లాన్ అమలుకు శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేయని గత సర్కార్
- పట్టించుకోని ప్రస్తుత ప్రభుత్వం
- సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న భక్తులు
నిర్మల్, వెలుగు: బాసర సరస్వతీదేవి ఆలయం సమస్యలకు కేరాఫ్గా మారింది. నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నా అందుకు తగ్గట్లు సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదు. ఆలయ అభివృద్ధి కోసం ఏడేండ్ల కింద రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు అమలుకు నోచుకోవడం లేదు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఆర్భాటంగా భూమి పూజ చేసిన గత ప్రభుత్వం ఆ తర్వాత నిధులు మంజూరు చేయడాన్ని విస్మరించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి బాసర మాస్టర్ ప్లాన్ అమలు చేసి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
ప్లాన్ ప్రకటించి.. పైసలివ్వని గత ప్రభుత్వం
బాసరను అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు రావడంతో 2018లో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ బాసరను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ పనుల కోసం రూ. 50 కోట్లు మంజూరు చేస్తూ486 జీవోను సైతం జారీ చేశారు. తర్వాత కర్నాటకలోని శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు ఆలయ పునర్నిర్మాణ ప్రణాళికను రెడీ చేశారు.
అప్పటి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే విఠల్రెడ్డి కలిపి అభివృద్ధి పనులకు భూమిపూజ సైతం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.
అడుగడుగునా సమస్యలే..
అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు నిత్యం వేలాది మంది బాసర ఆలయానికి వస్తుంటారు. ఆలయం వద్ద క్యూలైన్లు, వసతి గృహాలు, తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే గోదావరి స్నానవాటికల వద్ద కనీస సౌకర్యాలు, దుస్తులు మార్చుకునేందుకు గదులు కూడా లేకుండాపోయాయి. దీంతో మహిళా భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఘాట్ల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు కూడా లేకపోవడంతో పలువురు గోదావరిలో పడి ప్రాణాలు
కోల్పోతున్నారు.
భద్రతపై భరోసా కరువు..
బాసర సరస్వతీదేవి ఆలయ భద్రతపై ఆఫీసర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఆలయంలో చోరీ జరిగినా పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో ఆఫీసర్లు విఫలం అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సిస్టంపై నియంత్రణ లేకపోవడంతో పలుమార్లు భద్రతాపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి.