
- ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు 24 బోనస్ మార్కులు
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో 2025-–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో మొత్తం 1,500 సీట్లు అందుబాటులో ఉండగా, మహబూబ్ నగర్ క్యాంపస్కు 180 సీట్లు కేటాయించారు.
పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలోని పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని స్థాపించారని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యను అందించి, పేద విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా ఈ వర్సిటీ కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు అడ్మిషన్ల సమయంలో 24 బోనస్ మార్కులు అదనంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
జులై 7న తొలిదశ కౌన్సెలింగ్..
ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వీసీ గవర్ధన్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీలకు చెందిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ను ప్రింట్ అవుట్ తీసుకొని, సంబంధిత డాక్యుమెంట్లను జోడించి పోస్ట్ ద్వారా జూన్ 25 వరకు పంపించాలని సూచించారు. మిగతా వారు ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని చెప్పారు.
జులై 4న ప్రొవిజినల్ ఎంపిక జాబితాను ప్రకటించి.. జులై 7న తొలి దశ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తు విధానం, రుసుము, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ www.rgukt.ac.inను అభ్యర్థులు సందర్శించాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల దరఖాస్తు తేదీల్లో ఏవైనా మార్పులు ఉంటే.. వెబ్సైట్లో తెలియజేస్తామన్నారు.