ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ 2026 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటే ప్రసారకులకు భారీ ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని.. టోర్నమెంట్ను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేస్తుందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ హెచ్చరించారు. పాకిస్తాన్ వరల్డ్ కప్ ఆడుతుందా లేదా అనే ఊహాగానాల మధ్య అలీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయంగా మారాయి. భద్రత కారణాలను వంకగా చూపిస్తూ బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న తర్వాత పాకిస్థాన్ కూడా ఈ మెగా టోర్నీలో ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. తమ దేశ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే వరల్డ్ కప్ ఆడతామంటూ చెప్పుకొచ్చింది.
గేమ్ ప్లాన్ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ బాసిత్ అలీ ఇలా అన్నాడు. "పాకిస్తాన్ ప్రపంచ కప్ ఆడకపోతే, బ్రాడ్ కాస్టర్స్ రోడ్డుపైకి వస్తారు. పాకిస్తాన్ వైదొలగితే ఆ స్థానంలో ఏ జట్టు ఉంటుంది? ఇండియా ప్రత్యామ్నాయ జట్టుతో ఆడితే.. ఆ మ్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుందా..?. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెలివిజన్ రేటింగ్లు.. డిజిటల్ వ్యూయర్షిప్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై ఆధారపడతాయి. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో యాడ్స్ రూపంలో గణనీయమైన ఆదాయం లభిస్తుంది". అని బాసిత్ చెప్పుకొచ్చాడు.
టీ20 వరల్డ్ కప్ బాయ్ కాట్ చేసే ఆలోచనలో స్కాట్లాండ్:
టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడంపై పాకిస్తాన్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. టోర్నీలో పాల్గొనాలా వద్దా? అనే అంశంపై తుది నిర్ణయాన్ని ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం వరకు తీసుకుంటామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తెలిపాడు. భద్రతా కారణాల దృష్ట్యా ఇండియాలో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్పై ఐసీసీ బషిష్కరణ వేటు వేయడానికి నిరసనగా పాక్ టోర్నీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఈ క్రమంలో నఖ్వీ తాజాగా దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యాడు. ఐసీసీ వ్యవహారంపై అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ప్రధాని సూచించినట్లు నఖ్వీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
బంగ్లాదేశ్కు సాధ్యమైనంత వరకు మద్దతుగా నిలవాలని ప్రధాని షరీఫ్ బోర్డుకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాక్ ప్రభుత్వం, పీసీబీ రెండు ప్రధాన అంశాలపై ఆలోచిస్తున్నాయి.అసలు వరల్డ్ కప్ నుండే పూర్తిగా తప్పుకోవాలని లేదంటే ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఇండియాతో జరిగే హై -ప్రొఫైల్ మ్యాచ్ను బహిష్కరించాలని భావిస్తోంది. మరోవైపు వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే మాత్రం పాక్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోనుంది. ఆసియా కప్లో ఆ జట్టుపై వేటు వేయడంతో పాటు పీఎస్ఎల్లో ఫారిన్ ప్లేయర్లకు అనుమతి ఇవ్వకూడదని భావిస్తోంది.
