
న్యూఢిల్లీ: ఇండియా, వెస్టిండీస్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 10) నుంచి జరిగే రెండో టెస్ట్ కోసం బ్యాటింగ్ పిచ్ను రెడీ చేస్తున్నారు. తొలి రెండు రోజులు మంచి స్ట్రోక్ ప్లేకు అవకాశం ఉంటుందని క్యూరేటర్లు భావిస్తున్నారు. మూడో రోజు నుంచి బాల్ టర్న్ అయ్యే అవకాశం ఉంది.
ఫిరోజ్ షా కోట్లా పిచ్ ఉపరితలంపై నల్లటి మట్టి ఉంటుంది. దాని వల్ల ఆరంభంలో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. క్రమంగా పిచ్లో పగుళ్లు ఏర్పడటం వల్ల స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. అయితే రెండో టెస్ట్ కోసం కొత్తగా సెంటర్ పిచ్ను రెడీ చేశారు. దీనిపై బ్యాటర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
‘ఈ మ్యాచ్ కోసం కొత్త పిచ్ను సిద్ధం చేశారు. స్మృతి మంధాన 50 బాల్స్లో సెంచరీ చేసిన ట్రాక్ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఆరంభంలో సమాన బౌన్స్తో పాటు బాల్ ఈజీగా ముందుకు వెళ్తుంది. విండీస్ బాగా బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ మూడు రోజుల్లో ముగియదు. మూడో రోజు నుంచి నెమ్మదిగా స్పిన్కు అనుకూలిస్తుంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
స్థానిక క్యూరేటర్ అంకిత్ దత్తా పర్యవేక్షణలో బీసీసీఐ సీనియర్ క్యూరేటర్లు తపోష్ చటర్జీ, ఆశిష్ భౌమిక్ తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం మూడో రోజు మధ్యాహ్నం వరకు బ్యాటర్లకు అనుకూలంగా ఉండే చాన్స్ ఉంది. కాగా, బుధవారం ఇండియా, వెస్టిండీస్ ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు.