- రూ. 500 కోట్లు రిలీజ్ అంటూ ప్రచారం
- పీడీ అకౌంట్లో మాత్రం పైసా వేయని సర్కార్
- నిధులు దారిమళ్లించారంటున్న సంఘాల నేతలు
హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ లకు రూ. 500 కోట్లు రిలీజ్ చేశామంటూ గత మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నది. కానీ.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా పైసా కూడా ఖర్చు చేయలేదు. దీంతో ఈ సారైనా లోన్ లు వస్తాయని ఎదురు చూస్తున్న బీసీ యువతకు నిరాశే ఎదురవుతున్నది. బీసీల సంక్షేమం విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. బీసీల నిధులను మాత్రం ఖర్చు చేయకుండా వేరే శాఖలకు దారి మళ్లిస్తోందంటూ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
పీడీ అకౌంట్ లో వేయలే
రాష్ట్ర ప్రభుత్వం 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు నిధులను కేటాయించలేదు. 2021–22లో మాత్రం బీసీ, ఎంబీసీ కార్పొరేషన్కు చెరో రూ. 500 కోట్ల చొప్పున బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నాటికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనో, లేక ఏదో ఇచ్చినట్లు చేద్దామనుకున్నదో తెలియదు గానీ.. మార్చి 3వ తేదీన బీసీ కార్పొరేషన్కు రూ. 250 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.250 కోట్లకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఇచ్చింది. కానీ వీటిని పీడీ అకౌంట్లోకి పంపలేదు. దీంతో బీఆర్వో ఇచ్చినా పైసలు అక్కరకు రాని పరిస్థితి ఏర్పడింది. మొత్తం రూ. వెయ్యి కోట్లలో కనీసం రూ.500 కోట్లు అయినా వస్తయనుకుంటే అవి కూడా పత్తాలేకుండా పోయాయి.
5.7 లక్షల అప్లికేషన్లు పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లకు బీఆర్వో ఇవ్వడంతో ఇక లోన్లు వస్తాయని బీసీ యువతలో ఆశలు చిగురించాయి. సర్కారు లోన్లు ఇస్తే చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవచ్చని ఆశిస్తున్నారు. కానీ సర్కారు తీరుతో నాలుగేండ్లుగా వారి ఆశలు అడియాసలు అవుతున్నాయి. అధికారులు లోన్లకు యాక్షన్ ప్లాన్లు రూపొందిస్తున్నా ప్రభుత్వం ఆమోదించపోవడంతో ఏటా నిరాశే ఎదురువుతోంది. 2018 తర్వాత ఒక్కరికి కూడా పైసా రుణం ఇవ్వలేదు. మొత్తం ఏడేండ్లేలో రెండు సార్లు మాత్రమే లోన్లు ఇచ్చారు. ఇప్పటికే 5.7 లక్షల లోన్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి.
ఎంబీసీలకు ఎప్పుడూ ఇంతే..
ఎంబీసీ కార్పొరేషన్కు ఏటా నిధులు కేటాయిస్తున్నా పైసలు మాత్రం ఖర్చు చేయడంలేదు. బడ్జెట్లో రూ. వేల కోట్లు కేటాయిస్తున్నా లబ్ధిదారులకు ఇప్పటి దాకా రూ. 7.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఎంబీసీలకు ఏటా రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని గతంలో ఎంబీసీల మీటింగ్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తర్వాతి బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించినా.. రూ. 350 కోట్లకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది. అందులోంచి అసెంబ్లీ ఎన్నికల ముందు రూ. 7.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2018–19లో రూ. వెయ్యి కోట్లు, 2019–20లో జీరో కేటాయింపులు, 2020–21, 2021–22 బడ్జెట్లో రూ. 500 కోట్ల చొప్పున అలకేట్ చేశారు. కానీ రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తంగా రూ. మూడు వేల కోట్లు కేటాయిస్తే.. ఇప్పటిదాకా కనీసం రూ.10 కోట్లు కూడా లబ్ధిదారులకు ఖర్చు చేయలేదు.
రూ. 500 కోట్లు ఏమైనయ్?
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు జీవో రిలీజ్ చేశారు. బీఆర్వో కూడా ఇచ్చారు. ఈ నిధులతో కొంత మందికైనా లోన్లు వస్తాయని బీసీలు ఆశపడ్డరు. కానీ ఇప్పటిదాకా పైసా కూడా ఖర్చు చేయలే. బీఆర్వో ఇచ్చి నిధులను విడుదల చేయకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫ్రీజ్ చేసి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోంది. అసలు ఈ రూ. 500 కోట్లు ఏమైనయో చెప్పాలె.
- జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్