హైదరాబాద్,వెలుగు: బీహార్ ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్రంలోనూ బీసీల లెక్కలు తీయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్అన్నారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం నేతలు సెక్రటేరియెట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతి పత్రం అందించారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలన్నారు. బీసీల లెక్కలు తీసిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కోరారు. బీసీలకు సంబంధించిన లెక్కలు లేక పోవడం వల్లే జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో నష్టం జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. లెక్కలు లేకపోవడం వల్లే పెంచిన రిజర్వేషన్లను కోర్టులు రద్దు చేశాయని చెప్పారు.
ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి
పెండింగ్లో ఉన్న ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు జాతీ య బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం సెక్రటేరియెట్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో అవి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. బీసీ గ్రాడ్యుయేట్లకు జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వాలన్నారు. బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్ ను రూ.15 వేల కోట్లకు పెంచాలని కోరారు.