
- ఓఆర్ఆర్ టెండర్లు, కైటెక్స్ యూనిట్ల ఏర్పాటులో భారీ అవినీతి
- ఏసీబీకి.. బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ యుగంధర్ గౌడ్ వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ టోల్ లీజు టెండర్లు , కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటులో భారీ అవినీతి జరిగిందని, దీనికి కారణమైన అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఏసీబీని కోరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీసులో శుక్రవారం ఆయన డీజీని కలిసి బీఆర్ఎస్ ముఖ్యనేతలపై కేసులు నమోదు చేయాలని వినతిపత్రం అందించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థకు 30 ఏండ్ల పాటు ఔటర్ టోల్ వసూలు అప్పగించడం పెద్ద స్కామ్ అని, ఇందులో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నిర్వహణ ఖర్చు ఎక్కువ య్యే ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలో ఉంచి, ఆదాయం వచ్చే మార్గాన్ని ఐఆర్బీ ఇన్ ఫ్రాకు కట్టబెట్టారన్నారు.
2023 ఏప్రిల్ 27న ఐఆర్బీకి ఔటర్ టోల్ కాంట్రాక్ట్ దక్కితే.. 2023 జూలై 4న ఐఆర్బీ సంస్థ రూ.25 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ కు ఇచ్చిందని, వారం రోజుల్లోనే ఆ డబ్బును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకుందన్నారు. వరంగల్ కైటెక్స్ కంపెనీ రూ.15 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొంటే.. మరునాడే బీఆర్ఎస్ వాటిని ఎన్ క్యాష్ చేసుకుందన్నారు.
రంగారెడ్డి జిల్లాలోనూ కైటెక్స్ కంపెనీ 2023 సెప్టెంబరు 12న రూ.10 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ కి ఇవ్వగా, అక్టోబరు 16న ఆ పార్టీ ఎన్ క్యాష్ చేసుకుందన్నారు. ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రూ. వేల కోట్ల ప్రజా ధనం లూటీ చేశారన్నారు. విచారణ జరిపి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.