బషీర్ బాగ్, వెలుగు : కులగణనకు బీసీలు ఎన్నో ఏండ్లుగా పోరాడుతుంటే గత పాలకులు పట్టించుకోలేదని, బీసీల కలను సాకారం చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకమని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం ఏకగ్రీ వంగా ఆమోదం పొందిన సందర్భంగా ఆదివారం గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ సంద్భరంగా యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ.. 2014 లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ లెక్కలు వెల్లడించకపోవటమే గాక, పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించి రాజకీయంగా అణిచివేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో కులగణనకు అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తుచేశారు. నేతలు ప్రసాద్ నాయుడు, కార్తీక్, అనిల్ కుమార్, సాయి, సైదులు, రవి కుమార్, భాస్కర్, సోమయ్య ఉన్నారు.