జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఏం చెపుతోంది ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఏం చెపుతోంది ?

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్​. దీన్ని అందరూ అన్ని పార్టీలూ ఆసక్తిగానే చూశాయి. అధికారపార్టీ (కాంగ్రెస్​ పార్టీ)కి అనుకూలంగా ఫలితం రావడంతో  ప్రధాన ప్రతిపక్షపార్టీ(బీఆర్​ఎస్​) దాని అస్తిత్వంపైనే ఆందోళనకు గురవుతున్నది. రెండో ప్రతిపక్షపార్టీ (బీజేపీ) కనీసం రెండో స్థానమైనా దక్కించుకోవడమో లేదా కనీసం గౌరవప్రదమైన ఓట్లనో సాధించుకోవాలనుకుంది. కానీ, అందుకు భిన్నంగా  డిపాజిట్​ కోల్పోవడంతో దాని నాయకత్వ బలహీనతపైనే ఆ పార్టీలో తీవ్రంగా  చర్చ జరుగుతోంది.

ఏది ఏమైనా.. రెండేండ్ల రేవంత్​ ప్రభుత్వం పట్ల ఈ ఉప ఎన్నిక ఫలితం  ప్రజల్లో సానుకూలతకో, వ్యతిరేకతకో కొలమానం కాకపోయినా.. రేవంత్​ నాయకత్వం బలమైనదేనని నిరూపించుకుందని మాత్రం చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయవేత్త అని ఉప ఎన్నిక ఫలితం చెపుతోంది. ఉప ఎన్నిక సోషల్​ ఇంజినీరింగ్​లో సీఎం రేవంత్​ సక్సెస్​ అయ్యారు. అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్​ ఉన్నా.. అనేకసార్లు ఉప ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి పార్టీని గెలిపించడం మాత్రం ఆయన తన సమర్థతను చాటి చెపుతోంది.

గత పదేండ్లలో ఆర్థిక విధ్వంసానికి గురైన తెలంగాణ ప్రభుత్వాన్ని  చక్కదిద్దాల్సిన పెద్ద బాధ్యత మాత్రం రేవంత్​పైనే ఉంది. రేవంత్​ ప్రభుత్వానికి రాజకీయ సవాళ్ల కన్నా .. ఆర్ఠిక సవాళ్లే పెద్ద సమస్య. బీఆర్​ఎస్​ పదేండ్ల ఆర్థిక విధ్వంసం నుంచి రేవంత్ ​ ప్రభుత్వం అనేక అవరోధాలను ఎదుర్కొంటూ వస్తున్నది.  వాటిని ఇప్పటికిప్పుడు అధిగమించడం రేవంత్​ ప్రభుత్వానికి అంత సులభం కాకపోవచ్చు. రేవంత్​ రెడ్డి అనేక సదస్సుల్లో గత పదేండ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి డైరెక్టుగా ప్రజలకే చెపుతున్నారు. ఆయన చెపుతున్నవన్నీ పూర్తి నిజాలే.

ఉద్యోగుల  బెనిఫిట్స్, ఫీజు రీయింబర్స్​మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల జీతాలు ఆలస్యంగా అందడం  వంటి అనేక సమస్యలకు రెండేండ్ల రేవంత్​ ప్రభుత్వమే కారణమని ఎవరూ అనుకోవడం లేదు. గత బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు పడేయాలంటే, రేవంత్​ ప్రభుత్వానికి ఇంకా చాలాకాలమే పట్టొచ్చు. ఈ విషయం ప్రజలకు కూడా బాగా తెలుసు. కాబట్టి రేవంత్​  ప్రభుత్వానికి జూబ్లీహిల్స్​ గెలుపుతో మరింత బాధ్యత పెరిగింది తప్ప  తరగలేదు.  గత ప్రభుత్వ  అవినీతిపై జరిగిన దర్యాప్తులపై చర్యలు ఏవి?  అనే  ప్రజల ప్రశ్నకు జవాబుదారీగా వాటిపై  చర్యలు తీసుకుంటే,  రేవంత్​ ప్రభుత్వం  ప్రజల మరింత విశ్వసనీయతను కాపాడుకున్నట్లవుతుంది!

ధనిక ప్రతిపక్షం దర్పం తగ్గలే !
జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో బీఆర్​ఎస్​ ప్రచారం, అర్భాటం అధికార పార్టీతో  సమానంగా చేసింది. అస్త్రశస్త్రాలు అన్నీ ఉపయోగించింది. పేరుకు బీఆర్ఎస్​  ప్రతిపక్షమే అయినా మునుపటి దర్పం ఏమాత్రం తగ్గలేదు. పదేండ్లలో బీఆర్​ఎస్​ దేశంలోనే  ధనిక పార్టీగా నమోదయింది. అర్థబలం, క్యాడర్​ అంగ బలం పుష్కలంగానే ఉంది. ఇప్పటి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్న అప్పటి అధికారుల సహకారం  బీఆర్​ఎస్​ యజమానులకు ఇప్పటికీ ఉన్నదని అనేక సంఘటనలూ చెపుతున్నాయి కూడా!  అందుకే  ఆ పార్టీ హావభావాలలో, విమర్శలలో అధికార దర్పం తప్ప తామొక ప్రతిపక్షం అనేది కనిపించదు.

నైతికత లేని ప్రశ్నలతో అభాసుపాలు !
బీఆర్​ఎస్​ ‘ముఖ్య నేతలు’ జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీపై చేసిన ఆరోపణలు, విమర్శలు చాలానే ఉన్నాయి. కానీ అందులో ఏ ఒక్క విమర్శ చేయడానికీ ఆ పార్టీకి నైతికత ఉన్నట్లనిపించదు. ఫీజు రీయింబర్స్​మెంట్, రిటైర్డ్​ ఉద్యోగుల బెనిఫిట్స్​ బకాయిలు వంటివి ఎన్నో కేటీఆర్ బాగా లేవనెత్తారు.​ కానీ వాటన్నిటి బకాయిలు తమ ప్రభుత్వ హయాంలోనే చాలామేరకు ఏర్పడ్డాయనే విషయం ఆయన మర్చిపోయాడనుకోలేం! గత మున్సిపల్​ మంత్రిగా కేటీఆర్​ జూబ్లీహిల్స్​ మురికివాడలు, బస్తీల దుస్థితి గురించి మాట్లాడితే..  ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయన ఆలోచించలేదు. మంత్రి వివేక్​  రూ. వందల కోట్లతో ఆ పనులు చక్కబెట్టారు కూడా. గంపెడు తప్పులు చేసిన బీఆర్​ఎస్​ ఇపుడు అవే తప్పులపై ఇప్పటి అధికార పార్టీ కాంగ్రెస్​ను ప్రశ్నిస్తే ఎంత అనైతికంగా ఉంటుందో కేటీఆర్​ చేసిన ప్రచారాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

నైతికత లేని ప్రతిపక్షమే.. కాంగ్రెస్​కు కలిసొచ్చిన అంశం !
కేసీఆర్​ ప్రభుత్వం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు, 58 నుంచి 61 ఏండ్లకు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్​ను పెంచింది. ఆరేండ్లుగా రిటైర్డ్ కావలసినవారంతా 2023 తర్వాత రిటైర్​ అయ్యారు. వారి బెనిఫిట్స్​ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్​ ప్రభుత్వం పై పడింది. ఇలా అన్ని అర్థిక సమస్యలను రాబోయే ప్రభుత్వంపై నెట్టేసిన బీఆర్​ఎస్​ యజమాని ఇపుడు ఫాంహౌజ్​లో హాయిగా సేద తీరుతున్నారు. 

తాము చేసి పెట్టిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దలేమని వారికీ తెలుసు కాబట్టి.. బీఆర్​ఎస్ యజమానులు నిజంగా 2023 ఎన్నికల్లో తమకు తాము  ఓడిపోవాలని కోరుకున్నారేమో అని అనిపిస్తోంది! అందుకే, తాము చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టి ‘పిల్లి కళ్లుమూసుకొని పాలు తాగుతున్నట్లు’ తామే చేసిన తప్పిదాలపై మరొకరిని నిందించడం  ఒక ఫ్యాషన్​గా మార్చుకున్నారు. ప్రశ్నించే నైతికతను కోల్పోయిన ప్రతిపక్షం ఉండడం.. రాజకీయంగా కాంగ్రెస్​ పార్టీకి జూబ్లీహిల్స్​లో బాగా కలిసొచ్చిన అంశం అని చెప్పాలి. నిజానికి కాంగ్రెస్​ ను ఏ మాత్రమైనా  ప్రశ్నించదగ్గ నైతికత ఉన్న పార్టీ ఏదంటే, అది బీజేపీయే! కానీ ఆ పార్టీ ఆ బాధ్యతను నైతికత లేని బీఆర్​ఎస్​కే వదిలేసినట్లుంది! 

జబ్బుగా మారిన బలహీనత!
గత 7 ఏండ్లుగా తెలంగాణలో బీజేపీ బాగా బలపడిన పార్టీగా పేరుంది. 2024  లోక్​ సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించి, 8 లోక్​సభ స్థానాలు గెలవడం చూస్తే, ఇక రాష్ట్రంలో  కాంగ్రెస్​ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. కానీ ఆ పార్టీ తమది వాపేకానీ, బలుపు కాదంటూ.. జూబ్లీహిల్స్​లో తాను కాకుండా బీఆర్​ఎస్​ను రెండో స్థానంలో నిలబెట్టింది. రాష్ట్రంలో బీజేపీ బలహీన నాయకత్వం అనే జబ్బుతో బాధపడుతున్నదనేది కామన్​ మ్యాన్​ టాక్​ మాత్రమే కాదు.. ఆ పార్టీ క్యాడర్​లోనూ అదే అభిప్రాయం బలంగా ఉంది. బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణను కాలానికి 
వదిలేసినట్లుంది!

స్థానిక నాయకత్వం లేకుండా బీజేపీ గెలుపు అసాధ్యం!
ఉత్తరాదిలో లోక్​సభ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా మోదీ చరిష్మాతోనే గెలుస్తూ వస్తోంది. అక్కడ స్థానిక నాయకత్వం అవసరం లేకపోవచ్చు. కానీ, తెలంగాణ అనే రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ నేత(కేసీఆర్​), ఒక జాతీయపార్టీకి చెందిన ప్రాంతీయ నేత(రేవంత్​రెడ్డి) ఉన్నాడనే విషయం బీజేపీ అధినాయకత్వానికి అవగాహన ఉందో లేదో తెలియదు! అలా ఇద్దరు ప్రాంత నేతలను ఎదుర్కోవాలంటే, స్థానికంగా సమ ఉజ్జీ నాయకుడు ఉండాలనే  సోయి బీజేపీకి ఉందనిపించదు. 

ఉత్తరాది లాగనే తెలంగాణలోనూ మోదీ పేరనే గెలవాలంటే అది లోక్​సభ ఎన్నికలకు సరిపోతుంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా మోదీ పేరనే గెలవాలంటే అది సాధ్యం కాదని చరిత్ర చెపుతోంది. మోదీ చరిష్మా, స్థానిక నాయకుడి పటిమ కలిస్తేనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు అవకాశాలు ఉంటాయి.  ఎంత ఆర్గనైజేషనల్​​ పార్టీ అని చెప్పుకున్నా.. స్థానికంగా బలమైన నాయకుడు లేకుండా గెలవడం ఏమేరకు సాధ్యమో మోదీకే  తెలియాలి! 

బీఆర్ఎస్​తో అంతర్గత సంబంధాలపై అనుమానాలు?
గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీ పగ్గాలను బలహీన నాయకత్వాలకు అప్పజెప్పడంలోని మోదీ ఉద్దేశం ఏమిటో ఆ పార్టీ క్యాడర్​కే ఇప్పటికీ అర్థం కాలేకపోతున్నది.  బీఆర్​ఎస్​తో అంతర్గత అవగాహన ఏమైనా ఉందా అనే అనుమానాలూ పెరుగుతున్నాయి! ప్రజలు వద్దనుకుంటున్న పార్టీతో బీజేపీ ఎలాంటి సంబంధాలు నెరిపినా.. తెలంగాణలో కాంగ్రెస్​  పార్టీకి కాలం మరింత కలిసొచ్చినట్లే అని అంటున్నారు రాజకీయ పండితులు! రిమోట్​ గ్రామాల్లోనూ లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీకి ప్రజలు ఓటేశారంటే చిన్న విషయం ఏమీ కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్​, బీజేపీలే ప్రధాన ప్రత్యర్థులుగా స్థిరపడతాయని, బీఆర్​ఎస్​ తన అస్తిత్వాన్ని కోల్పోనుందనే అభిప్రాయం సర్వత్రా ఉన్న దశలో..   ఆ పార్టీ పనితీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తోంది!

బైపోలర్ రాజకీయాల్లో బీజేపీ పనితీరు ఇదా ?
తెలంగాణ రాజకీయాల్లో త్రికోణ (ట్రయాంగులర్​)  పోటీకి అమోదం లభించడం లేదని గత  అసెంబ్లీ,  లోక్​సభ ఎన్నికలు చెప్పాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్,​-బీఆర్​ఎస్​లే ప్రధాన ప్రత్యర్థులుగా    (బైపోలర్​గా) జరిగాయి. 2024 లోక్​సభ ఎన్నికలు కాంగ్రెస్,​ బీజేపీలు మాత్రమే ప్రధాన ప్రత్యర్థులుగా జరిగాయి. ట్రయాంగులర్​ పోటీకి అవకాశం లేదని ఆ రెండు ఎన్నికలు చెప్పాయి. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక కూడా అదే విషయం చెప్పింది. కానీ అది బీజేపీకి మాత్రమే అర్థంకాని విషయంగా ఉన్నట్లుంది కదా!

తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా కొనసాగేదే తప్ప కనుమరుగయ్యేది కాదు! ఇక ప్రత్యర్థిగా బీఆర్​ఎస్​, బీజేపీలలో ఏది అనే వాతావరణం ఉన్న దశలో.. జూబ్లీహిల్స్​లో అంతటి పూర్​ పర్ఫామెన్స్​ చూపిన బీజేపీని ఎవరు కాపాడతారో తెలియదు! బైపోలర్​ పొలిటికల్​ సిచువేషన్​ ఉన్న తెలంగాణలో బీజేపీ నిలబడాలనుకుంటున్నదా? లేక బీఆర్​ఎస్​కే తిరిగి అప్పజెప్పాలను కుంటున్నదా అనేదే తేలాలి! రాష్ట్రంలో  ప్రజల తిరస్కరణకు గురైన బీఆర్​ఎస్ పార్టీయే తిరిగి​ ప్రధాన ప్రత్యర్థిగా బతికితే మాత్రం ఆ దోషం ఘనత వహించిన కిషన్​ రెడ్డి, రామచంద్రరావులదే కాదు..వారిని రాష్ట్ర పెద్దలుగా ఆదరిస్తున్న నరేంద్ర మోదీది కూడా అవుతుంది! 

కల్లూరి శ్రీనివాస్​రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్