రాజకీయాల్లో కొత్త విషయం లేనపుడు.. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా అధికార పార్టీలకు గెలుపులు పెద్ద కష్టం కావు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థాయిలో గెలుపు సాధిస్తుందని పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక ప్రతిపక్షాలు కూడా ఊహించే ఉంటాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరగలేదు. కాబట్టి, వాటి ఫలితాలను ఒక కొలమానంగా ఎవరూ భావించలేకపోయారు.
ఇపుడు మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగాయి కాబట్టి, పార్టీల పర్ఫామెన్స్ను అంచనా వేసే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓటు బ్యాంకును మున్సిపల్ ఎన్నికల్లోనూ యథాతథంగా నిలుపుకుంది. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ఓటు బ్యాంకులలో ఎగుడు దిగుడు తేడాలొస్తున్నాయి. నిజానికి 2028 నాటికి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, బీజేపీలలో ఏది కానుందనేదే తెలంగాణ రాజకీయాల్లో కీలకాంశంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలపడలేదు కదా అని బీఆర్ఎస్ సంతోషపడి ఉండాలి! బీఆర్ఎస్కు ఆ భయం లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి బాగా పెరిగింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ భయాన్ని బీఆర్ఎస్ కొంత తుడిచేసుకోగలిగింది. కానీ అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ కాస్త బలంగానే ఉంటుంది కదా, అలాగే ప్రత్యామ్నాయ మంత్రంలో మునిగితేలుతున్న బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో పుంజుకుంటుందేమో అనే భయం మాత్రం బీఆర్ఎస్కు మొన్నటిదాకా వెంటాడింది. కానీ బీజేపీకి పంచాయతీ ఎన్నికల లాగే, మున్సిపల్ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క మున్సిపాలిటీలోనైనా సొంత మెజారిటీ సాధించలేకపోవడం రాష్ట్రంలో ఆ పార్టీ దైన్యస్థితి ఏమీ మారలేదని చెపుతోంది. పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికలు నిజంగా మూడు పార్టీల బలాబలాలకు ఓ కొలమానంగా అందరూ భావించారు.
కాంగ్రెస్ అధికార పార్టీగా తన బలాన్ని చాటుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలు మంచి మార్కులే సాధించుకున్నాయి. మిగిలింది బీఆర్ఎస్, బీజేపీలలో ఏది ప్రత్యామ్నాయం అనే చర్చ తెలంగాణలో చాలాకాలంగా నడుస్తున్నదే. అందుకు మున్సిపల్ ఎన్నికలు ఒక కొలమానం కాకపోవచ్చు. కానీ బీజేపీ ఎదగలేకపోతున్నదనే విషయాన్ని మాత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెపుతున్నాయి. బీజేపీకి కరుడుగట్టిన కార్యకర్తల సంఖ్య పెరగొచ్చు. కానీ కచ్చితత్వ నాయకుల సంఖ్యనే ఆ పార్టీలో పెరగడంలేదు, అలాగే ఉన్న నాయకులలోనూ తాము ఎదగాలనే కసి కనిపించడం లేదు, బండి, ధర్మపురి, పాయల్ లాంటి వారిలో తప్ప!
స్థిరత్వం సాధించని బీజేపీ, బీఆర్ఎస్
లోక్సభ ఎన్నికల్లో 16శాతం ఓట్లకు పడిపోయిన బీఆర్ఎస్కు పంచాయతీ ఎన్నికలు కొంత ఊరటనిచ్చాయి. ఇపుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఆపార్టీ ఎన్ని మున్సిపాలిటీలు గెలిచింది అనేకన్నా, లోక్సభ ఎన్నికల్లో సాధించిన 16శాతం ఓట్ల కంటే ఎంత శాతం ఓట్లను అధికంగా సాధించింది అని చూడాలి. సుమారు 12 శాతం అధికంగా సాధించింది. లోక్సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించిన బీజేపీ, మున్పిపల్ ఎన్నికల్లో 15 శాతం ఓట్లకు పడిపోయింది అంటే, సుమారు 20 శాతం ఓట్లను కోల్పోయింది. బీఆర్ఎస్, బీజేపీల ఓట్ల శాతంలో రెండేండ్లలో తేడాలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతంలో మాత్రం తేడా రాకపోవడం గమనార్హం. అంటే, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ స్థిరత్వాన్ని చాటుకుంటున్నపుడు, మూడేండ్ల తర్వాత బీఆర్ఎస్, బీజేపీలలో ఏది ప్రత్యామ్నాయంగా నిలబడుతుందంటే ఇప్పటికీ సందిగ్ధంగానే ఉందని చెప్పాలి.
అసెంబ్లీ ఎన్నికల్లో 37శాతం, లోక్సభ ఎన్నికల్లో 16శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 28శాతం సాధించిన బీఆర్ఎస్ రాజకీయ స్థిరత్వం మాత్రం ఇప్పటికీ ప్రమాదంలోనే ఉందని చెప్పాలి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో 14శాతం, లోక్సభ ఎన్నికల్లో 35శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 15శాతం సాధించిన బీజేపీ కూడా తెలంగాణలో రాజకీయ స్థిరత్వం సాధించలేకపోతున్నది. బీఆర్ఎస్, బీజేపీల అస్థిరత్వాలు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకేనేమో, పదేండ్లు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పగలుగుతున్నారు!
బీజేపీ తీరు బీఆర్ఎస్కు కలిసొస్తుందా?
2024 లోక్సభ ఎన్నికల్లో 35శాతం ఓట్లు సాధించడంతో తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అదొక పెద్ద మలుపుగా రాజకీయ పండితులు భావించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ చరిష్మా పనిచేసింది. ఇపుడు పంచాయతీల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మోదీ చరిష్మానే పనిచేయదు కదా! రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంటే కదా ఫలితాలు సాధించేది! స్థానిక నాయకత్వ కొరత, ఎంపీలు ఎవరికివారే తీరుతో.. లోక్సభ ఎన్నికల్లో తెచ్చుకున్న ఓటుశాతాన్ని బీజేపీ ఏమాత్రం నిలబెట్టుకోలేకపోతున్నది.
లోక్సభ ఓటు శాతాన్ని బీజేపీ రిపీట్ చేయలేకపోయినా.. మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 20శాతం ఓట్లైనా సాధించి ఉంటే.. బీఆర్ఎస్ను రాజకీయంగా కార్నర్ చేయగలిగే అవకాశం ఉండేది! రాష్ట్ర నాయకత్వ కొరత పుణ్యమా అని రోజురోజుకూ బలహీనపడుతున్న బీజేపీ తీరు.. ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబరపరిచే అంశమే! వాస్తవానికి ప్రజలు బీఆర్ఎస్ను కావాలని కోరుకుంటున్నది లేదు. మున్సిపల్ ఎన్నికల్లో మరో ప్రత్యామ్నాయం లేక బీఆర్ఎస్ కు ప్రజలు రెండో స్థానం ఇచ్చారు. అది తెలంగాణలో బీజేపీ వైఫల్య రాజకీయాల పుణ్య ం మాత్రమే!
బీఆర్ఎస్ కు నైతికత లేమి, బీజేపీకి దుర్భలత!
వాస్తవానికి గత రెండేండ్లుగా బీఆర్ఎస్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించినా, అది నైతికంగా నిలబడలేకపోతున్నది. కేసీఆర్ పదేండ్ల పాలన కేసీఆర్నే ప్రశ్నిస్తోంది. ఇక బీఆర్ఎస్ రేవంత్ ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించగలుగుతోంది? అది ఏమేరకు నిలబడుతోంది? తమ పాలనలో జరిగిన తప్పిదాలపైనే, తిరిగి రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి! ప్రశ్నించే నైతికత లేని బీఆర్ఎస్ నిజానికి ప్రతిపక్షంగా రాణించలేకపోతున్న పరిస్థితి ఉండగా.. అంది వచ్చిన ఆ పరిస్థితిని సైతం బీజేపీ అందుకోలేకపోతున్న దుస్థితి చూస్తే, తెలంగాణలో ఆ పార్టీ బీఆర్ఎస్ను ఏ మేరకు రీప్లేస్ చేయగలుగుతుంది? అలాంటి బీజేపీ దుర్భలత వల్లనే కదా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ రెండో స్థానంలో నిలబడగలిగింది!
సమస్యల్లో బీఆర్ఎస్, అయినా బీజేపీ బలహీన ప్రదర్శన!
బీఆర్ఎస్ యజమానులు అనేక దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలతో సతమతమవుతున్నారు. నిజానికి కవిత చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నది. తిరిగి జవాబులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఓవైపు కుటుంబ కలహాలు, మరోవైపు ప్రభుత్వాన్ని ఏ విషయంలో నిలదీసినా నైతికత లేకుండా పోవడం, ఇంకోవైపు తమపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తులు.. వెరసి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో..బీజేపీ నుంచి ఇంత బలహీన ప్రదర్శనను నిజంగా ఎవరూ ఊహించి ఉండరు!
నిజానికి, తెలంగాణలో బీజేపీ బలపడింది బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే. దేశ రాజకీయాలు ఎలా ఉన్నా, తెలంగాణ రాజకీయాలు అందుకు భిన్నం అని బీజేపీ ఢిల్లీ నేతలు గ్రహించలేకపోతున్నారు. బీఆర్ఎస్ను బతికిస్తూ బీజేపీ బలపడడమనేది తెలంగాణలో ఎన్నటికీ సాధ్యం కానిపని. ఈ విషయాన్ని ఢిల్లీ బీజేపీ అగ్ర నేతలు ఏమేరకు గమనిస్తున్నారు అనేదానిపైనే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది!
నిక్కచ్చితనం కొరవడింది
తెలంగాణలో నిక్కచ్చి రాజకీయం చేయడంలో ఇప్పటికైతే బీజేపీ విఫలమైందనే చెప్పాలి. బరిగీసి రాజకీయం చేస్తేగానీ ఏ పార్టీ అయినా ప్రత్యామ్నాయంగా ఎదిగిరాదు. ఎందుకోగానీ, ప్రధాని మోదీ తెలంగాణ రాజకీయాలతో ఎప్పుడూ దోబూచులాడుతూ వస్తున్నారు తప్ప, నిక్కచ్చితనం కనిపిస్తున్నది లేదు. రాష్ట్రానికి ఒక బలమైన నాయకుడిని పెట్టడంలో ఆయన ఇష్టపడుతున్నట్లులేదు. అది పరోక్షంగా బీఆర్ఎస్కు ఉపయోగపడే రాజకీయం తప్ప, బీజేపీని ఎదిగించే రాజకీయం మాత్రం కాదు. తెలంగాణ రాజకీయాల పట్ల మోదీలో మార్పు లేనంత కాలం బీజేపీ తెలంగాణలో కనిష్టంగా మూడో స్థానంలో బతికే పార్టీగానే ఉంటది తప్ప ఎదిగే పార్టీగా ఉండటం కష్టమే!
- కల్లూరి శ్రీనివాస్రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
NOTE : ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ: openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
