- ఇండియాతో యూఎస్ వాణిజ్య లోటు తగ్గించేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: అమెరికా నుంచి వంట గ్యాస్ను(ఎల్పీజీని) దిగుమతి చేసుకునేందుకు ఇండియా రెడీ అయ్యింది. గతంలో అప్పుడప్పుడు యూఎస్ నుంచి ఎల్పీజీ కొన్నా, మొదటిసారిగా కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి వచ్చే ఏడాది 22 లక్షల టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ఇతర దేశా క్రూడ్తో పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్లు సరిపడినంతగా ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నాయి.
ఎల్పీజీ కోసం మాత్రం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. కిందటేడాది 3.1 కోట్ల టన్నుల వంట గ్యాస్ వినియోగం జరిగింది. ఇందులో 65 శాతం అంటే 2.04 కోట్ల టన్నులు విదేశాల నుంచి తెచ్చుకున్నదే. ఎల్పీజీ దిగుమతుల్లో 90 శాతం యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి వస్తోంది. తాజా ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది ఎల్పీజీ దిగుమతుల్లో 10 శాతం అమెరికా నుంచి రానుంది.
ఈ కంపెనీల నుంచి సప్లయ్
ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు 2026లో 48 పెద్ద గ్యాస్ క్యారియర్ల ద్వారా ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. అమెరికన్ కంపెనీలు షెవ్రాన్, ఫిలిప్స్ 66, టోటల్ ఎనర్జీస్ వీటిని సప్లయ్ చేస్తాయి. అతిపెద్ద ఎల్పీజీ మార్కెట్ అమెరికా కోసం ఓపెన్ అయ్యిందని ఆయిల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురీ ఎక్స్లో పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక తొలి అడుగని అభివర్ణించారు.
‘‘ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ఒక్కో సిలిండర్ను రూ.500–550కే పొందుతున్నారు. అసలు ధర రూ.1,100కుపైగా ఉన్నా ప్రభుత్వం కిందటేడాది రూ.40 వేల కోట్ల భారం భరించింది” అని ఆయన అన్నారు. ఈ స్కీమ్ కింద లబ్ది పొందని వారికి 14.2-కేజీల ఎల్పీజీ సిలిండర్ రూ.853కి దొరుకుతోంది. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇండియాతో యూఎస్ వాణిజ్య లోటును తగ్గించాలని కేంద్రం ప్రభుత్వం చూస్తోంది. ఆయిల్ దిగుమతులను కూడా అమెరికా నుంచి పెంచుకుంటోంది. కానీ, అక్కడి నుంచి ఇండియాకు ఆయిల్ షిప్లు చేరడానికి సుమారు 45 రోజులు పడుతుంది. ఇదే టైమ్లో మిడిల్ ఈస్ట్ నుంచి ఆరు సార్లు ఆయిల్ సప్లయ్ అవుతుంది. అందువలన అమెరికా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగే అవకాశాలు లేవు.
