ఇంగ్లాండ్తో జులై 7 నుంచి జరిగే టీ20 సిరీస్కు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్కు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. అయితే మొదటి టీ20కి ఒక జట్టును..మిగిలిన రెండు టీ20లకు మరో జట్టును సపరేటుగా బీసీసీఐ ప్రకటించడం గమనార్హం.
ఫస్ట్ టీ20 మ్యాచ్కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అందుబాటులో ఉండడం లేదు. చివరి రెండు మ్యాచ్లకు వీరిద్దరు జట్టులో చేరతారు. అటు ఓపెనర్ రుతురాజ్ తొలి టీ20లో చోటు దక్కించుకున్నా.. రెండు, మూడు టీ20లకు ఎంపిక కాలేదు. అర్షదీప్ సింగ్ కూడా మొదటి మ్యాచ్లోనే ఆడతాడు. ఐపీఎల్ హీరో ఉమ్రాన్ మాలిక్..జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను మూడు టీ20లకు ఎంపికయ్యాడు. రాహుల్ త్రిపాఠి ఐర్లాండ్తో జరిగిన సిరీస్కు ఎంపికైనా.. తుది జట్టులో స్థానం దక్కలేదు. అయితే ప్రస్తుతం ఫస్ట్ టీ20కు ఎంపికవడంతో..అతను అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా చివరి రెండు టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు.
మరోవైపు ప్రస్తుతం కొవిడ్ కారణంగా టెస్టు ఆడలేకపోతున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ..టీ20 సిరీస్తో పూర్తిస్థాయి పగ్గాలు చేపట్టబోతున్నాడు. గతంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా కెప్టెన్లుగా వ్యవహరించారు. టీ20 సిరీస్ లోపు రోహిత్ కరోనా నుంచి కోలుకుంటాడు. దీంతో అతను ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ద్వారా పూర్తిస్థాయిలో కెప్టెన్గా విధులు నిర్వర్తించనున్నాడు.
ఇంగ్లాండ్తో టెస్టు ఆడుతున్న ప్లేయర్ల విశ్రాంతి కోసం బీసీసీఐ రెండు జట్లను సెలక్ట్ చేసింది. జూలై 7, 9, 10 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. జులై 5 నుంచి 9 వరకు టెస్ట్ జరుగుతుంది. మధ్యలో ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో బీసీసీఐ తొలి టీ20కి, రెండు, మూడు టీ20లకు సెపరేట్ జట్లను ప్రకటించింది.
ఇంగ్లాండ్తో మొదటి టీ20కి టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
చివరి రెండు టీ20లకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్