
న్యూఢిల్లీ: ఆసియా కప్ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ నజామ్ సేథీ సూచించిన హైబ్రిడ్ మోడల్కు బీసీసీఐ నో చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జై షా దీనిపై అనధికారికంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) పెద్దలకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఏసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందన్న ఉత్కంఠ మొదలైంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం 25 సభ్య దేశాలు ఉన్నా.. ఇందులో టెస్ట్లు ఆడే 5 దేశాలకే ఎక్కువ పవర్స్ ఉంటాయి. పాక్లో ఆడేందుకు తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో జై షా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించేందుకు మిగతా దేశాలు మద్దతిస్తాయా? అన్నది కూడా తేలాలి.