సికింద్రాబాద్, వెలుగు: అతడో హోంగార్డ్. రగ్బీ అంటే చాలా ఇష్టం. ఆ ఆటను ఇష్టపడేవాళ్లకు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు. ఓ టీంను ఏర్పాటు చేశాడు. కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చాడు. అయితే, రానురాను ఆటకు సంబంధించిన బాల్స్, స్పోర్ట్స్ యూనిఫాం, ఇతర మెటీరియల్స్కు డబ్బులు ఎక్కువయ్యేవి. వాటిని భరించే స్థోమత లేని అతడు, ఒకే రైల్వేస్టేషన్, ఒకే రైలులో చైన్ స్నాచింగ్లు చేశాడు. పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు. కేసు వివరాలను బుధవారం సికింద్రాబాద్ రైల్వే ఆఫీసులో ఎస్పీ అనురాధ వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.లక్షన్నర, 116 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బాసర స్టేషన్.. నర్సాపూర్ ఎక్స్ప్రెస్
మహారాష్ట్రకు చెందిన మోహన్దేవ్ రావు చవాన్ (28).. నాందేడ్ జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. రగ్బీ ఆటపై ఇష్టంతో టీమ్ను తయారు చేసి ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నాడు. అయితే, వాళ్లకు అయ్యే ఖర్చుకు డబ్బుల్లేకపోవడంతో తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే నాందేడ్ జిల్లా చిక్కల తండాకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తితో స్నేహం చేశాడు. ఇద్దరు కలిసి చైన్ స్నాచింగ్కు ప్లాన్ వేశారు. అందుకు ఆదిలాబాద్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ను ఎంచుకున్నారు. అక్కడ సెకండ్ ప్లాట్ఫాంపై ఆగే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ను టార్గెట్ చేసుకున్నారు. ఆ ఒక్క స్టేషన్లోనే, ఆ ఒక్క రైల్లోనే 2018 ఫిబ్రవరి నుంచి చైన్ స్నాచింగ్లు చెయ్యడం మొదలుపెట్టారు. ఆ ఒక్క ఏడాదే 8 స్నాచింగ్లకు పాల్పడ్డారు. జనవరి 1, ఫిబ్రవరి 4న కూడా చోరీలు చేశారు. కొట్టేసిన నగలను ముంబైలో అమ్మి సొమ్ము చేసుకునేవాళ్లు. మిగతా నగలను అమ్మేందుకూ మోహన్దేవ్రావు బుధవారం నిజామాబాద్కు వచ్చాడు. సమాచారం అందుకున్న నిజామాబాద్ రైల్వే పోలీసులు స్టేషన్లో తనిఖీలు చేశారు. మోహన్దేవ్రావును అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ప్రదీప్తో కలిసి చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడు. అతడిని రిమాండ్కు తరలించారు. ప్రదీప్, నగలను కొన్న వారి కోసం గాలిస్తున్నారు. చైన్ స్నాచర్ను పట్టుకున్న నిజామాబాద్ రైల్వే పోలీసులకు అనురాధ రివార్డులు అందజేశారు.