ఆపరేషన్ థియేటర్స్ క్లోజ్.. వాయిదా పడుతున్న సర్జరీలు
గతంలో రోజూ ఎమర్జెన్సీ పేషెంట్లు 500.. ఇప్పుడు వెయ్యికి పైనే
గాంధీని కరోనా ఆస్పత్రిగా మార్చడంతో పేషెంట్లంతా ఉస్మానియాకే
ఫీవర్, కింగ్కోఠి హాస్పిటల్ నుంచీ పేషెంట్లు ఇక్కడికే
ఓల్డ్ బిల్డింగ్లోని వార్డుల తరలింపుతో కొత్త తిప్పలు
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా దవాఖానకు పేషెంట్లు పోటెత్తుతున్నారు. గాంధీని పూర్తిగా కొవిడ్ హాస్పిటల్గా మార్చడం.. కింగ్ కోఠీ, ఫీవర్, నిమ్స్ హాస్పిటల్స్లోనూ కరోనా ట్రీట్మెంట్ అందిస్తుండటంతో ఇతర జబ్బులతో బాధపడే పేషెంట్లంతా ఉస్మానియాకే క్యూ కడుతున్నారు. దీంతో అక్కడ బెడ్లు సరిపోక, సరైన సౌలతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేషెంట్లను ఫ్లోర్ మీద పడుకోబెట్టి, బెంచీల మీద, కుర్చీల మీద కూర్చోబెట్టి ట్రీట్మెంట్ అందించాల్సిన దుస్థితి నెలకొంది. రెండు నెలల నుంచి ఆపరేషన్లు కూడా సరిగ్గా జరగడం లేదు. వారాల తరబడి ఆపరేషన్లు వాయిదా పడుతుండటంతో పేషెంట్ల అటెండెంట్లకు, జూనియర్ డాక్టర్లకు మధ్య తరచూ లొల్లులైతున్నాయి.
ఎప్పుడు చూసినా బెడ్లు ఫుల్
ఉస్మానియా హాస్పిటల్లో 1,200 బెడ్స్ ఉండగా.. ఐదారు నెలల నుంచి ఎప్పుడు చూసినా అవి ఫుల్గానే కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు ఇక్కడి ఓపీకి రోజూ వెయ్యి మంది పేషెంట్లు వచ్చేవాళ్లు. మార్చి, ఏప్రిల్ నుంచి గాంధీ హాస్పిటల్ను పూర్తిగా కొవిడ్ హాస్పిటల్గా మార్చడంతో.. ఆ రెండు నెలలు ఉస్మానియాలో ఓపీ పేషెంట్ల సంఖ్య డబుల్ అయింది. రెగ్యులర్గా గాంధీకి వెళ్లే పేషెంట్లకు కూడా ఉస్మానియానే పెద్ద దిక్కయింది. కరోనాకు ముందు ఉస్మానియా హాస్పిటల్కు ఎమర్జెన్సీ పేషెంట్లు రోజూ 500 మందిలోపే వచ్చేవాళ్లు. ఐదారు నెలల నుంచి రోజుకు వెయ్యి మందికిపైగా వస్తున్నారు. పేషెంట్స్ తాకిడి పెరగడంతో బెడ్స్ సరిపోవడం లేదు. సౌకర్యాలు సరిపోక ఒకటి, రెండు ఫ్లోర్లలో ఔట్ పేషెంట్ బ్లాక్ లను క్లోజ్ చేశారు.
కరోనా బారినపడుతున్న ఆర్థోపెడిక్ పేషెంట్లు
ఇటీవల భారీ వర్షాలకు ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ ఉరువడంతో అందులోని వార్డులను పక్కనే ఉన్న కులీ కుతుబ్షాహీ బిల్డింగ్లోకి మార్చారు. ఈ బిల్డింగ్లోని ఒకే ఫ్లోర్లో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ వార్డులను ఏర్పాటు చేశారు. జనరల్ మెడిసిన్ పేషెంట్లలో ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే.. వారి వల్ల ఆర్థోపెడిక్ పేషెంట్లకూ కరోనా సోకుతోంది. వేర్వేరు వార్డులు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదని జూనియర్ డాక్టర్లు అంటున్నారు. కరోనా బారిన పడిన ఆర్థోపెడిక్ పేషెంట్లను గాంధీ హాస్పిటల్కు తరలిస్తున్నామని, అక్కడ కరోనాకు తప్ప ఆర్థోపెడిక్కు ట్రీట్మెంట్ లేక పేషెంట్లకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
రెండు నెలలుగా ఆపరేషన్స్ బంద్!
ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్ను క్లోజ్ చేయడంతో అక్కడి ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. దీంతో జనరల్, ఆర్థోపెడిక్, సూపర్ స్పెషాలిటీ సర్జరీలన్నీ వాయిదా వేస్తున్నారు. జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ సర్జరీలు ఆగిపోయి రెండు నెలలు అవుతుంది. గతంలో రోజుకు జనరల్ సర్జరీలు 6 నుంచి 8, ఆర్థోపెడిక్ సర్జరీలు 4 నుంచి 5 వరకు చేసేవారు. ఇప్పుడు రోజుకు ఒకటి, రెండు మించి సర్జరీలు చేయలేని పరిస్థితి నెలకొంది. కుతుబ్షాహీ బిల్డింగ్లో పోస్ట్ ఆపరేటివ్ వార్డులు కూడా ఏర్పాటు చేయలేదు. టెంట్ వేసి టెంపరరీగా 30 బెడ్స్ ఏర్పాటు చేసినా వాటికీ ఆక్సిజన్ సపోర్ట్ లేదు. కాలు, చేయి విరిగి వచ్చే పేషెంట్లకు మూడు, నాలుగు గంటల్లోనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేక రెండు వారాల వరకు పోస్ట్ పోన్ చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు.
సౌకర్యాలు కల్పించాలని జూనియర్ డాక్టర్ల ఆందోళన
ఉస్మానియా హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ నెల 8 నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లకు చెందిన 180 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. హాస్పిటల్లో బెటర్ హెల్త్కేర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని వారు చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్స్, ఫుల్లీ ఎక్విప్పెడ్ అక్యుట్ సర్జికల్ కేర్ యూనిట్, ఫుల్లీ ఎక్విప్పెడ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, మెడిసన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లకు ప్రత్యేకంగా వార్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆక్సిజన్ పార్ట్స్, మానిటర్స్, వెంటిలేటర్స్ తదితర బేసిక్ హెల్త్కేర్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. హాస్పిటల్లో సౌకర్యాలు లేకనే పేషెంట్లు, వారి అటెండెంట్లతో తమకు గొడవలు అవుతున్నాయని జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. ఇంత చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో శనివారం జూనియర్ డాక్టర్లు సూపరింటెండెంట్ చాంబర్ను ముట్టడించారు. వారితో సూపరింటెండెంట్ చర్చలు జరిపి పది రోజుల్లోగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డెడ్లైన్లోగా సౌకర్యాలు కల్పిస్తే సరేసరి అని లేకుంటే మళ్లీ ప్రొటెస్ట్ తప్పదని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
ఇదేమన్నా పీహెచ్సీనా?
ఉస్మానియా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ లేకపోవడంతో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమన్నా ప్రైమరీ హెల్త్ సెంటరా? ఆధార్ కార్డ్, రేషన్ కార్డును నమ్ముకొని బతుకుతున్న పేదల పరిస్థితి ఏమిటి? డాక్టర్లుగా మేం ట్రీట్మెంట్ చేస్తం తప్ప సౌకర్యాలు కల్పించలేం కదా. సమస్యలపై ఇప్పటికే మూడుసార్లు హాస్పిటల్ సూపరింటెండెంట్, డీహెచ్లకు లెటర్ రాశాం. అయినా పట్టించుకోలేదు.
– రోహిత్, జూనియర్ డాక్టర్, ఉస్మానియా
నాలుగు డిపార్ట్మెంట్లు ఒకే బిల్డింగ్లో
ఉస్మానియా ఓల్డ్ బిల్డింగ్లో జనరల్ సర్జరీ, ఆర్థో, జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ డిపార్ట్మెంట్లు ఉండేవి. ఆ బిల్డింగ్ క్లోజ్ చేశాక అందులోని అన్ని డిపార్ట్మెంట్లను ఒక్క బిల్డింగ్లోనే అకామిడేట్ చేశారు. దీంతో స్పేస్ లేకుండా పోయింది. సర్జరీ డిపార్ట్మెంట్లో రోజూ 15 నుంచి 20 వరకు అడ్మిషన్స్ ఉంటాయి. దానికి ఎలక్టివ్ వార్డులేక పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్, మెడికేషన్ ఇచ్చి పంపిస్తున్నాం. 3 నెలలుగా పేషెంట్లకు సర్జరీలు చేయట్లేదు. దీంతో వాళ్ల బంధువులు మాపై అరుస్తున్నా రు. కుతుబ్షాహీ బిల్డింగ్లోని టెంపరరీ వార్డులో ఆక్సీజన్ సపోర్ట్ లేక ఎమర్జెన్సీ పేషెంట్లను షిఫ్ట్ చేయడం కష్టమవుతోంది.- వైభవ్, జూనియర్ డాక్టర్, ఉస్మానియా