ఎన్​కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు

ఎన్​కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు
  • కటకం సుదర్శన్ వర్ధంతి సభలో వక్తలు

బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తోన్న ఎన్​కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు కటకం సుదర్శన్ ద్వితీయ వర్ధంతిని బెల్లంపల్లిలోని కన్నాలబస్తీలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కటకం సతీశ్ నివాసంలో శనివారం జరిపారు. సభలో సామాజిక కార్యకర్త మహ్మద్ హుస్సేన్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదన కుమార్ స్వామి, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతక్క, సీపీఐ ఎంఎల్ జిల్లా అధ్యక్షుడు టి.శ్రీనివాస్ ప్రసంగించారు. 

బెల్లంపల్లిలోని కార్మిక కుటుంబంలో జన్మించిన కటకం సుదర్శన్ అనేక కార్మిక ఉద్యమాల్లో పాల్గొని మావోయిస్టు పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల్లో నుంచి బలవంతంగా వెల్లగొడుతోందని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్​కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

రచయిత అల్లం రాజయ్య, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలసాని రాజయ్య, సీబీసీఐడీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్, సుదర్శన్ సోదరులు కటకం రఘు, కమలాకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొని సుదర్శన్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.