- నికరంగా రూ.8 వేల కోట్ల విలువైన షేర్లు అమ్మిన ఎఫ్ఐఐలు
- 90 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడాయిల్ ధర
ముంబై: వరుస సెషన్లలో పెరిగిన బెంచ్మార్క్ ఇండెక్స్లకు శుక్రవారం బ్రేక్ పడింది. యూఎస్ ఇన్ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువగా రికార్డవ్వడం, క్రూడాయిల్ రేట్లు పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతం మేర పడ్డాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను జూన్ మీటింగ్లో కూడా తగ్గించకపోవచ్చనే అంచనాలు పెరిగాయి. సెన్సెక్స్ శుక్రవారం 793 పాయింట్లు పతనమై 74,245 దగ్గర ముగిసింది.
నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయి 22,519 దగ్గర సెటిలయ్యింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్లు రెడ్లో క్లోజయ్యాయి. సెన్సెక్స్లో సన్ఫార్మా, మారుతి, పవర్ గ్రిడ్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఎక్కువగా పడ్డాయి. టాటా మోటార్స్, టీసీఎస్, నెస్లే షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. ‘యూఎస్ ఇన్ఫ్లేషన్ మార్చిలో నెల ప్రాతిపదికన 0.4 శాతం పెరిగింది. అంచనాలను దాటింది. ఫలితంగా యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ భారీగా పెరిగాయి. యూఎస్ ఫెడ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను మూడు సార్లు తగ్గించగలుగుతుందా? అనే ఆందోళనలు పెరిగాయి.
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను మార్చకపోయినా, త్వరలో రేట్ల కోత ఉంటుందనే సంకేతాలను ఇవ్వడంతో యూరోపియన్ మార్కెట్లు లాభపడ్డాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. యూఎస్ ఫెడ్ రేట్ల కోత, ఆయిల్ ధరలు పెరగడంతో ఇండియన్ మార్కెట్లు కన్సాలిడేట్ అవుతున్నాయని పేర్కొన్నారు.
రూ.2.52 లక్షల కోట్లు తగ్గిన ఇన్వెస్టర్ల సంపద
ఇన్వెస్టర్లు శుక్రవారం సెషన్లో రూ.2.52 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈలోని లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.399.67 లక్షల కోట్లకు (4.79 ట్రిలియన్ డాలర్లకు) తగ్గింది. సెక్టార్ల పరంగా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీస్, రియల్టీ, బ్యాంకెక్స్, కమొడిటీస్, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్లు ఒకటిన్నర శాతం వరకు పడ్డాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యూఎస్ ఫెడ్ మూడు సార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేసిందని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. కానీ, తాజాగా విడుదలైన యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్లు చూస్తే రేట్ల కోత అనుకున్నదాని కంటే లేటుగా మొదలవ్వొచ్చని అభిప్రాయపడ్డారు. ‘ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉన్నా, గ్లోబల్ అంశాలు మార్కెట్ను కిందకి లాగుతున్నాయి’ అని ప్రశాంత్ పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడాయిల్ శుక్రవారం బ్యారెల్కు 90.56 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఒక శాతం మేర పెరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ.8,027 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, డీఐఐలు నికరంగా రూ.6,342 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జపాన్, సౌత్ కొరియా, చైనా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో క్లోజయ్యాయి.
భారతీ హెక్సాకామ్ బంపర్ బోణి
మార్కెట్ నష్టాల్లో కదిలినా, భారతీ హెక్సాకామ్ షేర్లు మాత్రం శుక్రవారం లాభాల్లో లిస్టింగ్ అయ్యాయి. కంపెనీ షేర్లు ఇష్యూ ధర రూ.570 కంటే 43 శాతం ప్రీమియంకు అంటే రూ.755 దగ్గర బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యాయి. ఇంట్రాడేలో రూ.880 వరకు పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.40,687.50 కోట్లకు చేరుకుంది.
5 నెలల కనిష్టానికి రిటైల్ ఇన్ఫ్లేషన్
రిటైల్ ఇన్ఫ్లేషన్ కిందటి నెలలో ఐదు నెలల కనిష్టానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గడంతో 4.85 శాతానికి దిగొచ్చింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతంగా, కిందటేడాది మార్చిలో 5.66 శాతంగా రికార్డయ్యింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ కిందటేడాది అక్టోబర్లో 4.87 శాతంగా ఉంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలోనే తక్కువగా నమోదయ్యింది. పరిశ్రమల ఉత్పాదకతను కొలిచే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.7 శాతం పెరిగింది. కిందటేడాది ఫిబ్రవరిలో 6 శాతం గ్రోత్ నమోదు చేసింది.