
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి (కే) శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో జహీరాబాద్ తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు లబ్ధిదారులు డబుల్ బెడ్ రూమ్ ల ముందు రోడ్ పై ధర్నా చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ ఆఫీసు వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు.
సీపీఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్ మాట్లాడుతూ పేదలు ఇల్లు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి రెండేళ్లవుతున్నా ఇండ్లను అప్పగించడం లేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే తామే లబ్ధిదారులతో ఇళ్లను ఆక్రమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సలీమొద్దీన్, బక్కన్న, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.