కుక్కలను పెంచుకోవడం కామన్. అయితే 20 కోట్లు పెట్టీ మరి కుక్కను కొనుగోలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. తాజాగా ఓ వ్యక్తి దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేసి కుక్కను కొనుగోలు చేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరుకు చెందిన కడబామ్స్ కెన్నెల్స్ ఓనర్, ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఖరీదైన కుక్కను కొనుగోలు చేశాడు. కాకాసియన్ షెపెర్డ్ జాతికి చెందిన కుక్కను రూ. 20 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇక ఈ శునకానికి కడబామ్ హెడర్ అని పేరు పెట్టాడు.
ఈ కుక్కకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది త్రివేండ్రమ్ కెన్నెల్ క్లబ్ ఈవెంట్, క్రౌన్ క్లాసిక్ డాగ్ షోలో పాల్గొని... బెస్ట్ డాగ్ బ్రీడ్ కింద 32కి పైగా మెడల్స్ గెలుచుకుంది. హేడర్ జీవితకాలం 10 నుంచి 12ఏళ్లు. 45 నుంచి 70 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ జాతి కుక్కలు మన దేశంలో కంటే.... అర్మేనియా, సర్కాసియా, జార్జియా, రష్యా వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
తాజాగా కొన్న కాకాసియన్ షెపెర్డ్కు ధైర్యం, నమ్మకం ఎక్కువ. దేనికీ భయపడదు అని సతీశ్ తెలిపారు. అత్యంత తెలివైన జాతి కుక్క. ఇవి చాలా పెద్ద సైజు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏసీ వాతావరణంలో పెరుగుతుందన్నారు. ఈ శునకాన్ని ఫిబ్రవరి నెలలో ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పుకొచ్చాడు. అతని దగ్గర ఇప్పటికే రూ.10కోట్ల టిబెటన్ మస్తిఫ్, రూ.8కోట్ల అలస్కన్ మాలామ్యూట్, రూ. కోటి విలువ గల కొరియన్ డోసా మస్తిఫ్ జాతి కుక్కలు ఉండటం విశేషం.