బెంగళూరులోని ఓ మెట్రో స్టేషన్ ను ప్రారంభించిన వారం రోజులకే వర్షం నీరుతో నిండిపోయింది. 13.71 కి.మీ పొడవైన నల్లూర్ హళ్లి మెట్రో స్టేషన్ ఫేజ్ II ను ప్రధాని నరేంద్ర మోడీ గత వారం రోజుల క్రితం ప్రారంభించారు. ఏప్రిల్ 4న భారీ వర్షం కారణంగా ఈ స్టేషన్ లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. వైట్ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు నడిచే ఈ కొత్త మెట్రో లైన్ను రూ. 4,249 కోట్లతో నిర్మించారు. ఈ వరద నీటితో నిండిపోయిన మెట్రో స్టేషన్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో సిటిజన్ ఫోరమ్ వైట్ఫీల్డ్ రైజింగ్ ప్లాట్ఫారమ్పై, టికెటింగ్ కౌంటర్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ వీడియోను చూసిన కొంత మంది ప్రయాణికులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే ఇలా అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి కాకుండానే మెట్రో స్టేషన్ ను ఓపెన్ చేశారని, అందుకే ఇలా జరిగిందంటూ ఇంకొందరు కామెంట్ చేస్తు్న్నారు. ఇక ఏప్రిల్ 4న సాయంత్రం కురిసిన వర్షంతో బెంగళూరులోని విమాన సర్వీసులు, ట్రాఫిక్ స్తంభించిపోయాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నగర శివార్లలో భారీ నీటి ఎద్దడి కారణంగా పద్నాలుగు విమానాలను అధికారులు దారి మళ్లించారు, అనేక ఇతర విమానాలు ఆలస్యమయ్యాయి.