ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యుల అరెస్ట్

ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యుల అరెస్ట్
  • మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచారణ నిమిత్తం  కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు షిఫ్ట్​

బెంగళూరు: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్సీబీ మార్కెటింగ్ అండ్​ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలేతో పాటు ఈవెంట్ మేనేజ్‌‌‌‌మెంట్ సంస్థ అయిన డీఎన్‌‌‌‌ఏ ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు చెందిన సునీల్ మాథ్యూ,  కిరణ్ కుమార్ సహా నలుగురు సిబ్బందిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

బుధవారం చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 56 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత గురువారం ఆర్సీబీ మేనేజ్​మెంట్​తో పాటు, ఈవెంట్ మేనేజ్‌‌‌‌మెంట్ సంస్థ డీఎన్​ఏ, కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

 ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్, బెంగళూరు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌‌‌‌ నిర్వహించి.. కొందరిని బెంగళూరు నగర శివారులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​లో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. 

తొక్కిసలాట కేసుకు సంబంధించి కొద్దిమంది అరెస్టులు జరిగాయని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ కూడా ధ్రువీకరించారు. అనంతరం వారిని విచారించేందుకు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌‌‌‌కు తరలించారు. మెడికల్​ టెస్ట్​ల తర్వాత తదుపరి ప్రక్రియను చేపడతామని పోలీసులు వెల్లడించారు. 

ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌ పై బదిలీ వేటు​

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో పలువురు పోలీసు ఉన్నతాధికారుల సస్పెన్షన్ తర్వాత శుక్రవారం ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌ హేమంత్ నింబాల్కర్‌‌‌‌ను కర్నాటక ప్రభుత్వం బదిలీ చేసింది. 

ఇప్పటికే ఈ కేసులో బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద, స్టేడియం ఇన్‌‌‌‌చార్జ్ అధికారి, ఏసీపీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(సెంట్రల్), స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ హౌస్‌‌‌‌మాస్టర్, కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కర్నాటక ఇంటెలిజెన్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌ హేమంత్ నింబాల్కర్‌‌‌‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.