
బెంగళూరు తొక్కిసలాట ఘటనకు బాధ్యులుగా బెంగళూరు పోలీస్ కమిషనర్పై కర్ణాటక ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సీపీ దయానంద్తో పాటు ఏసీపీ, డీసీపీలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌస్ మాస్టర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఇన్ఛార్జ్లను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అంతేకాదు.. ఆర్సీబీ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్యానెల్ను నియమిస్తున్నట్లు సిద్ధరామయ్య సర్కార్ ప్రకటించింది. ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తునకు సీఎం ఆదేశించారు.
రాష్ట్ర కేబినెట్ భేటీలో మంత్రివర్గంతో చర్చించిన సీఎం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గాయపడిన వారికి, మృతి చెందిన కుటుంబ వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి'కున్హా నేతృత్వంలో తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో జ్యూడీషియల్ విచారణ జరిపి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కర్ణాటక సర్కార్ ఆదేశించింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు.
వీరిని దగ్గర్లోని హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు మంగళవారం రాత్రి ఐపీఎల్ విజేతగా నిలిచింది. దీంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు.
సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నంబర్ 3కు తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో గాయపడిన వారిలో పలువురి హెల్త్ కండీషన్ సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. బౌరింగ్ హాస్పిటల్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.