
- పేరేంట్స్కు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యం లెటర్
- రూ.180 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడి
- 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ భవిష్యత్తుపై ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పేరెంట్స్ తమ పిల్లలను బడులకు పంపవద్దని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) యాజమాన్యం కోరింది. ఈ మేరకు తల్లిదండ్రులకు యాజమాన్యం లేఖ రాసింది. గత రెండేండ్లుగా స్టూడెంట్ల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, అయినా.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, ఇతరుల వద్ద అప్పులు చేసి పాఠశాలను నెట్టుకువస్తున్నామని ఆ లేఖలో తెలిపింది.
‘‘పిల్లలను బడుల్లో చేర్చుకోబోమని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే చెప్పాం. సంబంధిత ఆఫీసర్లు, రాజకీయ నాయకులు నెలలోపు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇవ్వగా పిల్లలను పాఠశాలలో చేర్చుకున్నాం. కానీ, ఇప్పటివరకూ ఎలాంటి నిధులు విడుదల కాలేదు. అందువల్ల ఈ నెల 4 నుంచి మీ పిల్లలను పాఠశాలలోకి అనుమతించం’’ అని యాజమాన్యం ఆ లెటర్ లో తెలిపింది. ఆ లెటర్ చదివిన విద్యార్థులు, పేరేంట్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
స్టూడెంట్ల భవిష్యత్తును నాశనం చేయడం ఏంది?
రాష్ట్రంలో 238 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. వాటిలో సుమారు 7 వేల మంది ఎస్టీ, 23 వేల మంది ఎస్సీ విద్యార్థులు చదువుకుంటున్నారు. డే స్కాలర్స్ స్టూడెంట్స్కి ఏటా రూ.28 వేలు, రెసిడెన్షియల్ విద్యార్థులకు రూ.42 వేల చొప్పున ఆయా స్కూల్స్కి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. అయితే 2023–24 నుంచి ఇప్పటివరకూ ఈ స్కీం కింద చెల్లించాల్సిన స్టూడెంట్స్ ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.180 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య కమిటీ చెబుతోంది.
దీనిపై ఇటీవల కమిటీ సభ్యులు మీటింగ్ పెట్టుకొని స్టూడెంట్స్ను పాఠశాలకు అనుమతించకూడదని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని స్కూల్స్ తరపున ఒకేసారి పేరేంట్స్కు లెటర్స్ పంపించాయి. దసరా సెలవులు ముగిసిపోగా సోమవారం నుంచి తమ పిల్లలను స్కూళ్లకు పంపే ముందు వచ్చిన ఈ లెటర్లపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.