
మహబూబ్ నగర్ : స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో లీడర్లు ఫుల్జోష్లో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారంతా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. జడ్పీటీసీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ ఎవరు చేయాలనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ స్థానాల్లో బీసీలకు అవకాశం ఇస్తారా? లేదా ఇతర వర్గాలకు చెందిన లీడర్లకు హైకమాండ్ అవకాశం కల్పిస్తుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
జనరల్ స్థానాల్లోనూ సీట్ల కోసం బీసీల పోటీ..
జడ్పీటీసీ స్థానాల్లో జనరల్, జనరల్ మహిళలకు రిజర్వ్ అయిన చోట్ల బీసీలు పోటీకి దిగే ఆలోచన చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ జడ్పీటీసీ స్థానం జనరల్ కు, రాజాపూర్ జనరల్ మహిళ, దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట జనరల్ మహిళ, దేవరకద్ర జనరల్కు రిజర్వ్ అయ్యాయి. అయితే ఈ స్థానాల్లో బీసీ వర్గానికి చెందిన లీడర్లు పోటీ చేయాలని చాలా కాలం నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. రిజర్వేషన్లు కూడా వారికి అనుకూలంగా వస్తాయని ఆశించారు.
కానీ, రిజర్వేషన్లు తారుమారు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అయితే ఎలాగైనా పోటీకి దిగాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదాహరణకు బాలానగర్ జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బీసీ లీడర్ సన్నద్ధం అయ్యారు. కానీ, ఈ స్థానం నుంచి మండలానికి చెందిన ఇద్దరు బలమైన లీడర్లు పోటీకి దిగాలని భావిస్తున్నారు. అయితే సదరు బీసీ లీడర్ మాత్రం కాంగ్రెస్లో తనుకున్న పరిచయాలను వాడుకొని జడ్పీటీసీ టికెట్ దక్కించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. మూసాపేట స్థానం నుంచి పోటీకి బీసీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన లీడర్లు కూడా ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ స్థానం నుంచి పోటీకి దాదాపు ఎనిమిది మంది పోటీ పడుతున్నారు. అలాగే దేవరకద్రలో కాంగ్రెస్కు చెందిన బీసీ వర్గంలోని ఓ సీనియర్ లీడర్ రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందని ఆశించాడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ.. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని పని చేస్తున్నాడు.
కానీ, రిజర్వేషన్ బీసీ కాకుండా జనరల్ రావడంతో నిరుత్సాహంలో ఉన్నాడు. అయితే పార్టీ క్యాడర్ మాత్రం తన పేరును ప్రపోజ్ చేస్తుందనే నమ్మకం పెట్టుకున్నాడు. ఇదిలాఉంటే ఇక్కడి నుంచి మరో సామాజిక వర్గానికి చెందిన లీడర్ను ఇక్కడి నుంచి పోటీకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
క్యాడర్ నుంచి అభిప్రాయ సేకరణ..
జడ్పీటీసీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. అత్యధిక స్థానాల్లో పార్టీ లీడర్లను గెలిపించుకోవాలని ఆ పార్టీ క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆయా మండలాల్లో జడ్పీటీసీ స్థానాల్లో పోటీకి ఎవరూ అర్హులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ లీడర్లు లిస్టులు తయారు చేస్తున్నారు. ప్రతి మండలం నుంచి ముగ్గురు లీడర్ల పేర్లను ఎంపిక చేస్తున్నారు. ఎంపిక చేసిన పేర్లను మండలాల వారీగా క్యాడర్తో సమావేశమై, క్యాండిడేట్ పేర్లను ఫైనల్ చేసే పనిలో పడ్డారు.
ఇందులో భాగంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ప్రజల్లో బలం ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? సదరు క్యాండిడేట్కు బలమైన ఓటు బ్యాంకు ఉండి, ఆర్థిక బలం లేకున్నా.. పార్టీ నుంచి సపోర్ట్ చేసే విధంగా హైకమాండ్కు రిపోర్టులు అందిస్తున్నారు. ఈ నెల 8 లోపు పేర్లను ఫైనల్ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.