తమ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు ఇస్తామంటూ మోసం చేసే నకిలీ ట్రేడర్ల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లోనే 20 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇలాంటి వారిపట్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్క్రైం ఎక్స్పర్టులు చెబుతున్నారు.
హైదరాబాద్: స్టాక్మార్కెట్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్టుగానే.. ఇన్వెస్టర్లను మోసం చేసే వారి సంఖ్యా పెరుగుతోంది. దాదాపు ప్రతి ఇన్వెస్టర్కు ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రేడర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ఈ మోసగాళ్లు ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు. ఇటీవల, ఇండోర్, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ నగరాల నుంచి ఇన్వెస్టర్లకు కాల్స్ వచ్చాయి.
తమ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలను సంపాదించవచ్చని ఆశచూపారు. వీరి వలలో పడితే దారుణంగా మోసపోవడం ఖాయం. హైదరాబాద్ కమిషనరేట్లోనే ఇప్పటికే ఇటువంటి 20 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ. 4 కోట్లకు పైగా నష్టపోయారని హైదరాబాద్ సైబర్క్రైమ్స్ ఏసీపీ మారుతి వెల్లడించారు. ముఖ్యంగా వీళ్లు చార్టర్డ్ అకౌంటెంట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్ల వంటి వారిపై కన్నేస్తారు. హైదరాబాద్కు చెందిన ఒక లాయర్ రూ. 85 లక్షలు, ఐటీ ఉద్యోగి రూ. 55 లక్షలు, చార్టర్డ్ అకౌంటెంట్ రూ. 91 లక్షలు, మరో ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి రూ. 25.30 లక్షలను ట్రేడింగ్ స్కామ్ కారణంగా పోగొట్టుకున్నారు.
ఎలా మోసం చేస్తారంటే...
పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మోసగాళ్లు తమ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో తమ క్లయింట్లు సంపాదించిన లాభాల నకిలీ స్క్రీన్షాట్లను అప్లోడ్ చేస్తారు. పెట్టుబడిదారులు డబ్బు పెట్టడానికి ఆకర్షితులైతే, మొదట్లో డబ్బును వారి బ్యాంక్ ఖాతాకు లాభాలుగా బదిలీ చేస్తారు. పూర్తిగా నమ్మకం కుదిరాక పెట్టుబడిదారుడు తమ ప్రీమియం/వీఐపీ ఛానెల్స్మెంబర్షిప్ తీసుకోవాలని బలవంతం చేస్తారు.
తద్వారా మరిన్ని లాభాలు వస్తాయని ఆశచూపుతారు. బాధితులు ఇలాంటి మెంబర్షిప్ తీసుకోగానే, వారి బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని అడుగుతారు. మరిన్ని లాభాలు వస్తాయని చెబుతారు. వెబ్సైట్లో చూపించే నకిలీ లాభాలను విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఆప్షన్ బ్లాక్ అయి ఉంటుంది. అన్బ్లాక్ చేయడానికి మరింత డబ్బు డిమాండ్ చేస్తారు. డబ్బు పంపగానే తీసుకొని మాయమవుతారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సెబీలో రిజిస్టర్ కాని అప్లికేషన్లను నమ్మకూడదు. ఎవరికీ డీమ్యాట్ ఖాతా వివరాలను ఇవ్వకూడదు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సంస్థ గురించి చెక్ చేసుకోవాలి. ఇటువంటి స్కామ్స్టర్ల పాన్ వివరాలతో సెబీ ఒక డేటాపూల్ను కూడా నిర్వహిస్తోంది. దానిని చెక్ చేశాకే పెట్టుబడి పెట్టాలి.