భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా హాస్పిటల్లో జనరల్ సర్జన్అందుబాటులో లేకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న గిరిజన యువకుడికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆపరేషన్ చేసి కాపాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలం సుడిబాక గ్రామానికి చెందిన మడపా భాస్కర్కు కొన్ని రోజుల కింద కరెంట్ షాక్ కొట్టింది. దాదాపు 60శాతం కాలిన గాయాలతో ఆ యువకుడిని హైదరాబాద్లో పలు హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఇందుకు సుమారు రూ.30లక్షల ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇక ఖర్చు పెట్టే స్థోమత లేక భద్రాచలం ఏరియా హాస్పిటల్కు తీసుకొచ్చారు. సూపరింటెండెంట్ రాజశేఖర్రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మంగళవారం హాస్పిటల్ వచ్చారు. హాస్పిటల్లో జనరల్ సర్జన్ లేకపోవడంతో ఆర్థోపెడిక్ సర్జన్ దేవరాజ్, డాక్టర్లు మల్లేశ్, నికిత, కౌండిన్య, సిబ్బంది సాయంతో జనరల్ సర్జన్ అయిన ఎమ్మెల్యే సుమారు 5 గంటలపాటు ఆపరేషన్ చేసి యువకుడిని కాపాడారు.
