నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ‘భారత్​ జోడో యాత్ర’

నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ‘భారత్​ జోడో యాత్ర’

ఐదు రోజులు జిల్లాలోనే... భారీ ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు

మెదక్/సంగారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. దివంగత ప్రధాన మంత్రి,ఇందిరాగాంధీ ఎంపీగా పార్లమెంట్​కు ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాలో యాత్ర కొనసాగనుంది. దీంతో ఇతర జిల్లాల కంటే ఎక్కువ సక్సెస్​ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్​ పార్టీ లీడర్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఐదు రోజులు ఇక్కడే.. 

భారత్​ జోడో యాత్ర బుధవారం సాయంత్రం బీహెచ్​ఈఎల్​ వద్ద సంగారెడ్డి జిల్లాలోకి ఎంటర్​కానుంది. 2 నుంచి 6వ తేదీ వరకు సంగారెడ్డి, మెదక్​ జిల్లాల్లోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఐదు రోజుల పాటు దాదాపు 90 కిలో మీటర్లు యాత్ర కొనసాగనుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్ర కొనసాగేలా మాజీ డిప్యూటీ స్పీకర్​దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దారి పొడువునా రాహుల్​కు వెల్​కం చెబుతూ భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. పటాన్​చెరు​, సంగారెడ్డి, అందోల్, నారాయణ ఖేడ్​ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర కొనసాగనుంది.  ఆయా నియోజకవర్గాలతోపాటు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలోని ఇతర నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, అనుబంధ సంఘాల కార్యకర్తలతోపాటు, ప్రజలను భారీగా తరలించేలా టీపీసీసీ బాధ్యులు, బ్లాక్​ కాంగ్రెస్​, మండల కాంగ్రెస్​ అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్లాన్​ రూపొందించారు. ఈ మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పలుచోట్ల సభల్లో మాట్లాడనుండడంతోపాటు, ప్రజలతో మాటామంతి నిర్వహించనున్నారు.

ఇందిర ప్రాతినిధ్యంతో ప్రాధాన్యత..

1980లో జరిగిన పార్లమెంట్​ మధ్యంతర ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా దక్షిణ భారత దేశంలో మెజారిటీ స్థానాల్లో ఎంపీలను గెలిపించుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి ఇందిరాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లోని మెదక్​ లోక్​ సభ స్థానంతో పాటు ఉత్తర ప్రదేశ్​లోని రాయ్​ బరేలి నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆమె గెలుపొందారు. అనంతరం ఆమె రాయ్​ బరేలి స్థానానికి రాజీనామా చేశారు.  2.32 లక్షల భారీ మెజార్టీతో గెలిచిన మెదక్ నుంచే పార్లమెంట్​ కు ప్రాతినిధ్యం వహించి ప్రధాని పీఠం అధిష్ఠించారు. ఆ తర్వాత పలుమార్లు ఆమె మెదక్ జిల్లాకు వచ్చారు. 1984 అక్టోబరు 31న ఆమె హత్యకు గురయ్యే వరకు మెదక్ ఎంపీగానే ఉన్నారు. కాగా ఇందిరా గాంధీ మనుమడు రాహుల్​ గాంధీ ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయనుండటంతో కాంగ్రెస్​ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భార్​ జోడో యాత్ర రూట్​లో పలుచోట్ల ఇందిరాగాంధీ హయాంలో ఉమ్మడి మెదక్​ జిల్లాలో జరిగిన అభివృద్ధి పనుల ఫొటోలతో ఎగ్జిబిషన్​ ఏర్పాటు చేసేలా పార్టీ లీడర్లు ప్లాన్​ చేశారు.