
‘‘రాష్ట్రప్రయోజనాలను వ్యక్తిగత అవసరాల కోసం సీఎం కేసీఆర్ తాకట్టు పెడుతున్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్నప్రాజెక్టుల వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారనుంది. ఏపీ ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీప్రతినిధుల బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర జల శక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తాం’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆదివారం ఆన్లైన్ ద్వారా సీఎల్పీ సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, దళితులపై జరుగుతున్న దాడులు, కృష్ణా జలాల వివాదం, అపెక్స్మీటింగ్, కాంగ్రెస్ నేతల జిల్లాప్రభుత్వ హాస్పిటళ్ళ సందర్శన, చేనేతల సమస్యలు, బెల్ట్ షాపుల మూసివేత, మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును టీఆర్ఎస్ అక్రమించటం వంటి అంశాలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం తర్వాత భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడారు.
బెల్ట్ షాపులపై ఉద్యమం
బెల్ట్ షాపులను వెంటనే మూసేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే బెల్ట్ షాపులపై ఉద్యమం చేస్తామని భట్టి ప్రకటించారు. దళితులపై జరుగుతున్న దాడులపై రాష్ట్రపతి, నేషనల్ఎస్సీ కమిషన్ చైర్మన్, కేంద్ర సోషల్ జస్టిస్ శాఖ మంత్రిని కలిసిఫిర్యాదు చేస్తామని చెప్పారు. కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ప్రతి అసెంబ్లీనియోజకవర్గకేంద్రంలో ఒక్కటైనా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్మెంట్ రేటును ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను సీఎల్పీ ఆధ్వర్యంలో సందర్శిస్తామన్నారు. కాంగ్రెస్ఎమ్మెల్యే లనే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను సైతం టీఆర్ఎస్ ఆక్రమిస్తోందని, ఇందుకు మణుగూరు సంఘటనే నిదర్శనమని భట్టి ఫైర్అయ్యారు. పినపాక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన రేగా కాంతారావు మణుగూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చటంతో వివాదం చెలరేగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇటీవల మణుగూరు వెళ్లి అక్కడి పార్టీ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.