రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగాచేయడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ మరణిస్తే వారు చెల్లించాల్సిన రుణభారాన్ని కుటుంబం పై మోపకుండా ప్రభుత్వమే చెల్లించే విధంగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో భట్టి విక్రమార్క ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు వడ్డీ లేకుండా కోటి రూపాయల వరకు రుణాలను ఇవ్వబోతున్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో 64 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇప్పించాలని సర్కారు నిర్ణయించినట్టు చెప్పారు. తద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 7 నుంచి మహిళలు తీసుకున్న రుణాలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే ఆ వడ్డీని చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రాబోయే ఐదేండ్లపాటు మహిళలు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే వడ్డీ కడుతుందని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల వల్ల రాష్ట్ర సర్కారు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, అయినప్పటికీ మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించాలని అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఉచిత ఆర్టీసీ బస్సు రవాణా సదుపాయం కల్పించామని గుర్తు చేశారు.